సిరా న్యూస్, జైనథ్:
ఘనంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం..
+ భక్తజన సంద్రంగా మారిన కూర గ్రామం
+ భారీగా తరలివచ్చిన భక్తులు
+ వేంకటేశ్వర నామస్మరణతో మార్మోగిన పుర వీధులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నుండి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి వారికి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, గ్రామ సర్పంచ్ అడ్డి లత, ఆలయ కమిటీ సభ్యులు పద్మావతి, అలివేలు మంగ అమ్మవార్ల సమేతుడైన స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీసమేతుడైన స్వామి వారిని మండపానికి అత్యంత భక్తిశ్రద్దలతో తీసుకొచ్చి, భాజభజంత్రీలు, వేద మంత్రాల నడుమ నూతవస్త్రాధారణ గావించారు. అమ్మవార్లను ముస్తాబు చేసి కళ్యాణోత్సవాన్ని శోస్త్రోక్తంగా జరిపించారు.
ప్రత్యేక పూజలు…
మహిళ భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చన గావించారు. అంతకుముందు గరుడ పూజ నిర్వహించి, గరుడ ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం గరుడ వహానంలో స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండ శోభాయాత్రను నిర్వహించారు. కాగా గత 17 సంవత్సరాలుగా ప్రతి ఏట స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామనీ, దీంతో తమ గ్రామం సుఖ శాంతులతో విరజిల్లుతున్నదనీ గ్రామస్తులు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు స్వామి వారి మహా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయావరణలో ఏర్పాటు చేసిన జాతర భక్తులను ఆకట్టుకుంది. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి మండలం నలుమూలల నుంచే కాక, జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల మండలాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం మొత్తం జన సంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, డిసిసిబి చైర్మన్ భోజా రెడ్డి, జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, నాయకులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.