సిరా న్యూస్, జైనథ్:
నేడు కూర వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
+ రెండు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
+ ముస్తాబైన ఆలయం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కళ్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆలయాని సుందరంగా ముస్తాబు చేసారు. కాగా ఆలయంలో శుక్రవారం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవ కలష అభిషేకం, నూతన వస్త్ర అలంకరణ, అర్చన ఇత్యాది కార్యక్రమాలతో పాటు విశ్వక్సేన ఆరాధన, పున్యఃవాచనం, అంకుర ఆరోపణ, ముత్యంగ్రహణం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం, చతుస్థాపన అర్చన, అఖండ దీపారాదన, ద్వారతోరణ పూజ, అగ్ని ప్రతిష్ఠాపన, హోమాది కార్యక్రమాలు సైతం పూర్తి చేసారు. ఈ సందర్భంగా గరుడ కళ్యాణం, ధ్వజారోహణం, బలిహరం కార్యక్రమాలను నిర్వహించి తీర్థప్రసాద వితరణలు చేపట్టారు.నేడు కళ్యాణోత్సవం…
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 11గంటలకు పద్మావతి, అలివేలిమంగ సమేతుడైన స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కళ్యాణమహోత్సవం సందర్భంగా స్వామి వారికి, అమ్మవార్లకు ూతన పట్తు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ, మహాపూర్ణాహుతి, తిలకధారణ, కుంకుమార్చన, పుష్పయాగము, ఊరేగింపు సేవ, స్వామి వారికి ఏకాంత సేవ, ఆశీర్వచనం, ఇత్యాది పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణోత్సవ వేడుకలను వీక్షించి, స్వామి వారి కృపకు పాతృలు కావాలని గ్రామస్తులు కోరుతున్నారు.