పొత్తులపై రాని క్లారిటీ

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో ఎన్నికల వేళ త్యాగాలకు సిద్ధపడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల కారణంగా టికెట్లు రాని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా ఇచ్చారాయన. మరోవైపు సిట్టింగ్‌లకు సీట్లు ఖాయమని చంద్రబాబు గతంలోనే చెప్పారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. జనసేనకు 40 సీట్లు రాబట్టాలని హరిరామజోగయ్య సూచిస్తుండగా బీజేపీ వ్యక్తే సీఎం అవుతారని విష్ణువర్ధన్‌ రెడ్డి చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే టీడీపీ- జనసేన కూటమి పొత్తులకు సహకరించిన నేతలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తుల కారణంగా టికెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దన్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు అధికారంలోకి రాగానే గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. చాలామంది వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీలో చేరతామంటున్నారని చంద్రబాబు టీడీపీ నేతలతో చెప్పారు. పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే టీడీపీలోకి తీసుకుంటున్నామన్నారు. నేతల చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని టీడీపీ నేతలకు సూచించారాయన.
మరోవైపు టీడీపీలో సిట్టింగ్‌లందరికీ మళ్లీ సీట్లు ఖాయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రెండేళ్ల క్రితమే చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారాయన. పొత్తుల్లో భాగంగా సర్దుబాట్లు కూడా ఉంటాయన్నారు. కనీసం 40 సీట్లు జనసేనకు రాబట్టాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య తీవ్రంగా యత్నిస్తున్నారు. టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు ఆయన ఈ విషయంలో లేఖలపై లేఖలు రాస్తున్నారు. నియోజకవర్గాలను కూడా ఆయన సూచిస్తున్నారు. ఏపీలో 20 సీట్లు ఆశిస్తున్న కమలనాథులు బీజేపీ వ్యక్తే ఏపీ సీఎం అవుతారని విష్ణువర్దన్‌ రెడ్డి జోస్యం చెబుతున్నారు. బీజేపీ బలీయమైన పార్టీగా ఎదిగిందన్నారు. ఏపీలో ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *