చివరి 48 గంటలు… బీ అలెర్ట్…

సిరా న్యూస్,విజయవాడ;
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు గడుగు దగ్గర పడింది. ఎన్నికలకు 48 గంటల ముందు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఏపీలో పలు జిల్లాల్లో సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని.. అలాంటి చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎండదెబ్బ తగలకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఈసీ రాజీవకుమార్ సూచించారు. ఈనెల 13 న నాలుగవ దశలో ఎన్నికల జరిగే రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజకుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 14 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులు, ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు రాజీవ్ కుమార్ పలు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నాల్గవ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తదితర 14 రాష్ట్రాలతో పాటు పలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈనెల 13 న ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు. అయితే వీటన్నింటిలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలను ఎంతో సున్నితమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల యంత్రాంగం అంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. మే 13న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ముందు 48 గంటలు ఎంతో కీలకమైనవన్నారు. 24 గంటలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని.. హింసకు ఏ మాత్రం అవకాశం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. ప్రత్యేకించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితంచేసే నగదు, ఇతర ఉచితాల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రత్యేకించి సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు.నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత సునిశితమైన రాష్ట్రంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‎లో కొన్ని జిల్లాలు సమస్యాత్మకంమైనవిగా గుర్తించడమైందని, ముఖ్యంగా ప్రత్యేక పరిశీలకులు ఆయా జిల్లాలో తరచుగా పర్యటిస్తూ ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. ఆయా జిల్లాలు, నియోజక వర్గాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తమకు నేరుగా తెలియపర్చాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో తిరిగి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండలు, వడగాల్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఏమాత్రము ఎండ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లు అన్ని షామియానాలతో కవర్ అయ్యేలా చూడాలని, ఓటర్లు కూర్చునేందుకు క్యూలైన్లలో బెంచ్‎లను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి త్రాగునీరు, ఓ.ఆర్.ఎస్, ప్రథమ చికిత్స సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని ఎస్.ఎం.ఎస్., షోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరుస్తూ ఓటింగ్ శాతాన్ని పెద్ద ఎత్తున పెంచాలని ఆదేశించారు.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *