సిరా న్యూస్, ఆదిలాబాద్:
ప్రజా పాలన దరఖాస్తులకు చివరి రోజు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 గ్యారెంటీల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగియనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో దరఖాస్తులకు చివరి రోజు అంటూ టామ్ టామ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి రోజు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనేక కారణాల చేత దరఖాస్తులు సమర్పించలేని వాళ్లు చివరి రోజు దరఖాస్తులు సమర్పించడానికి ఆసక్తి చూపు చూపుతున్నారు. దీంతో చివరి రోజు సైతం భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ప్రారంభం కానున్న ఆన్లైన్ ఫీడింగ్…
ప్రజల నుండి స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్ లో పొందుపరిచేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రజా పాలన దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా, పారదర్శకంగా ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగానే ప్రభుత్వం అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించనుండడంతో, ఈ ఆన్లైన్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని చెబుతున్నారు. ఈనెల 17 లోగా పూర్తిస్థాయిలో ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయినట్లు అధికారులు చెబుతున్నారు.