సిరా న్యూస్,బోబ్బిలి;
అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, రైల్వే చీఫ్ ఇంజినీర్ పాండే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేయడం సంతోషదాయకమన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో మూడు స్టేషన్లు ఆధునీకరణ జరుగుతుందన్నారు. అండర్ బ్రిడ్జిలో నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. కాశీ వెళ్లేందుకు వారాణసి ఎక్స్ ప్రెస్ రైలు వేపించామని చెప్పారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ రూ.16కోట్లతో ఆధునీకరణ చేయడం శుభపరిణామమన్నారు. చరిత్రాత్మక బొబ్బిలి అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు బొబ్బిలిలో హల్ట్ కల్పించేందుకు ఎంపీ పని చేశారన్నారు. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు టైమింగ్స్ మార్చాలని రైల్వే అధికారులను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో 554 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్ని రంగాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైల్వే ప్రాముఖ్యతపై నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, కవితల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మరిశర్ల రామారావునాయుడు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.