సిరా న్యూస్,ముంబై;
కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన లేఆఫ్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. చిన్నా, పెద్ద కంపెనీలు అన్న తేడా లేకుండా గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించాయి. 2023 మొత్తం లే ఆఫ్ లతో ఉక్కిరి బిక్కిరి అయిన టెక్కీలకు… ఈ ఏడాది కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది 2 లక్షల 40 వేల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫిబ్రవరి 3 వరకు 122 టెక్ కంపెనీలు 31,751 మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపాయి.ఈ ఏడాది ఇప్పటి వరకరూ…. ప్రముఖ వీడియో కమ్యూనికేషన్ యాప్ జూమ్ 150 మందిని తొలగించింది. క్లౌడ్ సాఫ్ట్వేర్ వెండర్ ఓక్తా 400 మందికి ఉద్వాసన పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గూగుల్ సైతం… డిసెంబర్-జనవరి మధ్య వెయ్యి మందిని తొలగించింది.ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో… గత రెండేళ్లుగా టెక్నాలజీ దిగ్గజ సంస్థలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. గూగుల్, అమెజాన్ సహా బిగ్ టెక్ కంపెనీలు… పొదుపు చర్యల్లో భాగంగా మరిన్ని ఉద్యోగాలు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ మానవులకు కొత్త కొత్త ఇబ్బందులను తెస్తోంది. టెక్ రంగంలో ఇటీవల ఏఐ విప్లవాన్ని సృష్టిస్తుంది. ఉద్యోగులు రోజుల తరబడి చేసే పనిని… ఏఐ ద్వారా క్షణాల్లో చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఏఐ ఇంకా వృద్ధిలోకి వస్తే ఉద్యోగాల కోత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి.. ఐటీ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలపై కోత విధిస్తుండటంతో.. యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.