సిరా న్యూస్;
కొవిడ్ తరవాత బాగా కుదుపులు వచ్చిన రంగమేదైనా ఉంటే అది ఐటీయే. ఇప్పటికీ ఈ ఇండస్ట్రీ కోలుకోలేదు. ఆశించిన స్థాయిలో గ్రోథ్ రేట్ కనిపించడం లేదు. ప్రాజెక్ట్లు తగ్గిపోయాయి. ఫలితంగా కంపెనీలు క్రమంగా వర్క్ ఫోర్స్ని తగ్గించుకోడం మొదలు పెట్టాయి. అందులో భాగంగానే లే ఆఫ్ లు ప్రకటించాయి. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే ఈ కోతలు మొదలయ్యాయి. దాదాపు ఏడాదిగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. బడా కంపెనీలన్నీ వేలాది సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రస్తుత ట్రెండ్ని చూస్తుంటే లేఆఫ్లు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఎలాగో 2023 గడిచిపోయింది. కనీసం 2024లో అయినా పరిస్థితులు చక్కబడతాయా అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా ఐటీ ఉద్యోగులకు కాస్త మనశ్శాంతి లేకుండా పోతోంది. కొన్ని కంపెనీలు రాత్రికి రాత్రే మెయిల్ పంపి ఎగ్జిట్ డోర్ తెరుస్తున్నాయి. షాక్ అవ్వడం ఉద్యోగుల వంతు అవుతోంది. ఆ తరవాత వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింకిడ్ ఇన్ లో ఇలాంటి బాధితులు వరుస పోస్ట్లు పెడుతూ తమ బాధనంతా చెప్పుకుంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, మెటా సహా పెద్ద పెద్ద సంస్థలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దశల వారీగా లేఆఫ్లు అమలు చేశాయి. కొనుగోలు శక్తి పడిపోవడం, కంపెనీకి వచ్చే ఆదాయం కన్నా పెట్టాల్ని ఖర్చులే ఎక్కువవడం లాంటి కారణాలు లేఆఫ్లకు దారి తీశాయి. అందుకే ఈ ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాల కోత పడింది. ఇప్పుడీ కారణాలతో పాటు మరోటి తోడైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. రానున్న రోజుల్లో ఏఐ వల్ల వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముంది. ఈ మధ్య కాలంలో లేఆఫ్లపై కొన్ని సంస్థలు సర్వేలు చేశాయి. అందులో అన్ని సర్వేలూ చెప్పిన విషయం ఒకటే. 2024లోనూ లేఆఫ్లు కొనసాగుతాయని. ఈ ఏడాదితో పోల్చి చూస్తే…ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందట. 38% మంది బిజినెస్ లీడర్స్ వచ్చే ఏడాది కూడా ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్టు వెల్లడించారు. 50% మంది హైరింగ్ ప్రాసెస్ని ఆపేయాలనుకుంటున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే…ఈ లేఆఫ్లకు కారణమేంటని అడిగితే దాదాపు 70% మందికి పైగా కాస్ట్ కట్టింగ్ అని చెబుతున్నారు. మిగతా 30% ఏఐ టెక్నాలజీ వల్లే అని తేల్చి చెబుతున్నారు. అంటే..మ్యాన్పవర్ని పక్కన పెట్టి పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి కొన్ని కంపెనీలు. అలా అని..అన్ని కంపెనీల ఉద్యోగులు రిస్క్లో ఉన్నారని చెప్పలేం. మిడ్సైజ్, లార్జ్ కంపెనీలలో ఈ లేఆఫ్ల విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. చిన్న కంపెనీలు మాత్రం ఈ లేఆఫ్లను పెద్దగా పట్టించుకోడం లేదు. వర్క్ఫోర్స్ని కాపాడుకుంటూనే ఉన్న ప్రాజెక్ట్లతో తంటాలు పడుతున్నాయి. కానీ…ఉద్యోగుల స్థానంలో ఏఐ వచ్చి చేరితే మాత్రం చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సంస్థల్లోనూ భారీ కోతలే ఉండొచ్చు. గూగుల్లో ఇప్పటికే ఏఐ ఎఫిషియన్సీ పెరిగింది. అందుకే… ఆ కంపెనీ వచ్చే ఏడాది దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే…మిగతా సంస్థలకూ ఈ ట్రెండ్ విస్తరిస్తుంది. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. గార్టనర్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం 2024లో భారత్లో ఐటీ సెక్టార్ గ్రోథ్ రేట్ 2023తో పోల్చి చూస్తే 10% ఎక్కువగా ఉంటుంది. అయితే…భారత్ ఐటీ సెక్టార్పై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉండదా..అంటే ఇప్పటికైతే లేదనే అంటున్నారు ఎక్స్పర్ట్లు. 2025 వరకూ ఈ ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చని తేల్చి చెబుతున్నారు. ఇప్పటి నుంచి మరో రెండు మూడేళ్ల పాటు ఏఐపై పెట్టుబడులు పెరుగుతాయని 2025 తరవాత ఏమైనా ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చని వివరిస్తున్నారు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తగ్గే కొద్దీ ఆ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ భర్తీ చేస్తూ వస్తుంది. ఇప్పటికైతే వచ్చిన ప్రమాదమేమీ లేదు కానీ…భవిష్యత్లో మాత్రం తప్పకుండా ఈ ముప్పుని ఎదుర్కోక తప్పదు. పైగా కొన్ని సర్వేల్లో ప్రతి 10 కంపెనీల్లో నాలుగు సంస్థలు త్వరలోనే వర్క్ఫోర్స్ని తగ్గించుకుని ఏఐని అడాప్ట్ చేసుకుంటామని చెబుతున్నాయి. అంటే…ఈ ట్రెండ్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. గత రెండేళ్లలో భారీ టెక్ కంపెనీలు 4 లక్షల 25 వేల మందిని తొలగించాయి. ఈ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 60 వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.