అమర్ నాధ్ కు లైన్ క్లియర్

సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అమర్‌నాథ్‌కు బెర్త్‌ ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి పోటీ చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. మంత్రి స్వస్థలం గాజువాక నుంచి అసెంబ్లీ టికెట్‌ కన్ఫార్మ్‌ చేసింది వైసీపీ అధిష్టానం.. దీంతో మంత్రి అమర్‌నాథ్‌ రాజకీయ భవిష్యత్‌పై సందేహాలన్నీ తొలగిపోయాయి.సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా… సీఎం క్యాబెనెట్లో బెర్త్‌ దక్కించుకున్న అమర్‌నాథ్‌.. రాజకీయ భవిష్యత్‌పై ఇటీవల కాలంలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మంత్రి అమర్‌నాథ్‌ పొలిటికల్‌ కెరీర్‌కు లైన్‌క్లియర్‌ అయినట్లైంది.అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్‌నాథ్‌కు గాజువాక సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం. ఐతే గత మూడు నెలలుగా జరిగిన పరిణామాలు మంత్రి రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలకు అవకాశమిచ్చాయి. మంత్రి సిట్టింగ్‌ స్థానం అనకాపల్లి ఇన్‌చార్జిగా మలసాల భరత్‌కుమార్‌ను గతంలో నియమించింది వైసీపీ అధిష్టానం.కానీ, మంత్రికి ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపలేదు. వాస్తవానికి మంత్రి కూడా చాలా కాలంగా కొత్త స్థానం వెతుకులాటలోనే ఉన్నారు. ఈ సారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఉద్దేశం మంత్రి అమర్‌నాథ్‌కూ లేకపోయినా… ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగింది. పెందుర్తి, చోడవరం, అనకాపల్లి ఎంపీ టికెట్‌ అంటూ రకరకాల ప్రచారం జరిగింది. కానీ, వాటి అన్నిటికీ పుల్‌స్టాప్‌ పెట్టి గాజువాక సీటు కట్టుబెట్టింది వైసీపీ హైకమాండ్‌.గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బదులుగా ఆ స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌ వరకూటి రామచంద్రరావును ఇన్‌చార్జిగా నియమించింది వైసీపీ… గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌ను ఓడించిన నాగిరెడ్డిని ఈ సారి తప్పించడానికి సామాజిక సమీకరణలే కారణంగా చూపింది.ఐతే ప్రతిపక్షాలను ఢీకొట్టే విషయంలో ప్రస్తుత ఇన్‌చార్జి వరికూటి రామచంద్రారావు సరిపోరనే భావనతో తాజాగా ఆయనను పక్కన పెట్టి ఆ బాధ్యతలు మంత్రి అమర్‌నాథ్‌కు అప్పగించింది. వాస్తవానికి గత మూడు నెలలుగా జరిగిన పరిణామాలతో మంత్రి అమర్‌నాథ్‌కు టికెట్‌ దక్కదనే ప్రచారం జరిగింది.సీఎం జగన్‌ కూడా ఇటీవల విశాఖ వచ్చినప్పుడు అమర్‌నాథ్‌ పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు సరికదా జిల్లాలో 15 ఎమ్మెల్యే సీట్లు గెలిపించే బాధ్యత అమర్‌దేనంటూ భారం మోపారు. దీంతో తాను సీఎం జగన్‌ ఏం చెబితే అదే చేస్తానని.. తన భవిష్యత్‌ సీఎం జగన్‌పైనే ఆధారపడిందని సెంటిమెంట్‌ రగిలించారు మంత్రి అమర్‌నాథ్‌.సిట్టింగ్‌ స్థానం నుంచి తప్పించినా, మూడు నెలలుగా టికెట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా, పార్టీకి విధేయుడిగా పనిచేయడంతో మంత్రి అమర్‌నాథ్‌ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం. ఊహాగానాలను అన్నింటిని పక్కన పెట్టి మంత్రి స్వస్థలం గాజువాక టికెట్ కన్ఫార్మ్‌ చేసింది. గాజువాక పక్కనే ఉండే మింథిలో అమర్‌నాథ్‌ సొంత ఇల్లు ఉంది.మంత్రి రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు కూడా ఇదే ప్రాంతంలో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఏవిధంగా చూసినా మంత్రి అమర్‌కు గాజువాక సేఫ్‌ ప్లేస్‌ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనకాపల్లి నుంచి తప్పించినా, మంత్రి అమర్‌నాథ్‌ మాత్రం… తనకు ఫలానా సీటు కావాలని అధిష్టానాన్ని అడగలేదని చెబుతున్నారు.అందుకే అమర్‌ బాధ్యత తనది అని చెప్పిన సీఎం జగన్‌…. ఇచ్చిన మాట ప్రకారం మంత్రికి పట్టున్న ప్రాంతంలోనే అవకాశమిచ్చారంటున్నారు. మంత్రి అమర్‌ గెలుపుతోపాటు జిల్లాలోని మిగిలిన స్థానాల గెలుపు బాధ్యతలను మోపారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *