సిరా న్యూస్;
దేశంలో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన ‘కనీస వేతన చట్టం’ తర్వాత ప్రజల స్థితిగతులు మారాయి. కార్మికులకు అందుతున్న కనీస వేతనాలు చాలా వరకు పెరిగాయి. అయితే, చాలా కంపెనీలు & పారిశ్రామిక సంస్థల మీద వేతన ఖర్చుల భారం పెరిగింది. దీనిని తప్పించుకోవడానికి ఆయా సంస్థలు చాలా ఎత్తులు వేశాయి, చట్టంలోని లోపాలను అవకాశంగా మార్చుకున్నాయి. దీనివల్ల చాలా కంపెనీల్లో ఉద్యోగులు, కార్మికులకు ‘కనీస వేతన చట్టం’ ప్రకారం వేతనాలు అందడం లేదు. కార్మికులు, ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కనీస వేతన చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందన్న వాదనలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. కనీస వేతన చట్టం నియమనిబంధనలను గతం కంటే స్పష్టంగా & బలంగా మారిస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని పరిశ్రమ ప్రముఖులు చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా పని చేస్తోంది. త్వరలో, కనీస వేతనాల స్థానంలో జీవన వేతన విధానాన్ని తీసుకు వచ్చే సన్నాహాల్లో ఉంది.ఇటీవల, అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా జీవన వేతన వ్యవస్థను సమర్థించింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ILO సూచనలు జారీ చేసింది. లివింగ్ వేజ్ ద్వారా ప్రస్తుత వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చాలని ILO కోరింది. భారత్ కూడా, 2025లో కనీస వేతన వ్యవస్థ స్థానంలో జీవన వేతన వ్యవస్థను తీసుకొచ్చే మార్చే ప్రక్రియను ప్రారంభించబోతోందని సమాచారం. ప్రస్తుతం, మన దేశంలో దాదాపు 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మందికి కనీస వేతనాలు అందడం లేదు.భారతదేశంలో కనీస వేతన విధానం ఇప్పుడు అమల్లో ఉంది. దీని ప్రకారం, గంటల లెక్కల జీతం లెక్కిస్తారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ రేటు ఒకేలా లేదు. ఏ ఉద్యోగికి కనీస మొత్తం కంటే తక్కువ వేతనం లేదా జీతం ఇవ్వకూడదు. మహారాష్ట్రలో, గంట పనికి కనీసం 62.87 రూపాయలు చెల్లిస్తుండగా, బిహార్లో ఈ లెక్క 49.37 రూపాయలుగా ఉంది. అమెరికాలో గంట పనికి 7.25 డాలర్లు లేదా 605.26 రూపాయలు తగ్గకుండా చెల్లిస్తారు. భారతదేశంలో, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలు కనీస వేతనాలు పొందడం చాలా కష్టంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రంగంపై పెద్దగా చర్యలు తీసుకోలేకపోతున్నాయి.జీవన వేతన వ్యవస్థను సాధారణ భాషలో అర్థం చేసుకుందాం. 75 ఏళ్ల క్రితం, మనిషి కనీస అవసరాలుగా ఆహారం, ఆశ్రయం, దుస్తులను (కూడు, గూడు, గుడ్డ) లెక్కలోకి తీసుకున్నారు. మారుతున్న కాలం & సాంకేతికతతో పాటు కనీస అవసరాల్లో మరికొన్ని అంశాలు వచ్చి చేరాయి. మారిన జీవన పరిస్థితులను జీవన వేతనం పరిగణనలోకి తీసుకుంటుంది. కార్మికుడి సామాజిక అభ్యున్నతికి అవసరమైన అన్ని కీలకాంశాలపై శ్రద్ధ పెడుతుంది. ఈ వ్యవస్థలో, కార్మికుడితో పాటు అతని కుటుంబానికి కూడా సామాజిక భద్రత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం, ఆశ్రయం, దుస్తులతో పాటు విద్య, ఆరోగ్యం, ఇంకా ఇతర అవసరాలను చేర్చి, వేతనాలను నిర్ణయిస్తారు. దీనివల్ల, కనీస వేతనం రూపంలో అందే డబ్బు చాలా వరకు పెరుగుతుందికనీస వేతనాలను, జాతీయ ఫ్లోర్ వేజెస్ (చట్టం నిర్ణయించిన కనీస వేతనం) స్థిరీకరించడానికి భారత ప్రభుత్వం 2021లో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి కనీస వేతనాలు, జాతీయ ఫ్లోర్ వేజెస్ను నిర్ణయించేందుకు సాంకేతిక ఇన్పుట్లను, సూచనలను అందించడం ఈ బృందం బాధ్యత. వేతనాల స్థిరీకరణ కోసం శాస్త్రీయ ప్రమాణాలు, పద్ధతిని రూపొందించేందుకు నిపుణుల బృందం సూచనలు, నిబంధనలు తోడ్పడతాయి. కనీస వేతనాల చట్టం, 1948లోని సెక్షన్ 3(1) (బి) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలోని షెడ్యూల్డ్ ఉద్యోగాలలో నిర్ణయించిన కనీస వేతనాలను ఐదేళ్ళకు మించకుండా సమీక్షించి, అవసరమైతే కనీస వేతనాలను సవరించడాన్ని తప్పనిసరి చేస్తుంది.
ఇటీవలే, కనీస వేతనాల చట్టం, 1948లోని నిబంధలను హేతుబద్ధీకరించి కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ,2019లో విలీనం చేసి, పార్లమెంటు ఆమోదించి, 08.08.2019న ప్రకటించింది. కోడ్లోని సెక్షన్ 8 (4) ప్రకారం ప్రభుత్వం కనీస వేతన రేట్లను సాధారణంగా ఐదేళ్ళకు మించికుండా సమీక్షించాలని లేదా సవరించాలని నిర్దేశిస్తుంది. చీఫ్ లేబర్ కమిషనర్ (సిఎల్సి) వెబ్సైట్లలో కనీస వేతనాల ప్రచారం, పని ప్రదేశాలు/ స్థలాలలో కాంట్రాక్టర్లు ఇచ్చే కనీస వేతనాలను బహిర్గతం చేయడం, ప్రధాన యజమానులు ఇచ్చే కనీస వేతనాల రేట్లను ప్రదర్శించాలని కనీస వేతనాలపై ప్రచారాన్ని ప్రారంభించి, కనీస వేతనాల రేటుకు కట్టుబడి ఉండేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సిఎల్సి (సి) కింద కేంద్ర పారిశ్రామిక సంబంధాల యంత్రాంగం (సిఐఆర్ఎం) సంస్థ ద్వారా కనీస వేతనాల చట్టం, 1948 కింద కేంద్ర పరిధిలోని సంస్థలలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. ఏదైనా సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కార్మికులకు తక్కువ వేతనాల ఇస్తున్నట్టు కనుగొన్నప్పుడు, క్లెయిమ్ను విచారించి, నిర్ణయించేందుకు అధికారుల ముందు క్లెయిమ్ అప్లికేషన్ను దాఖలు చేస్తారు. చట్టంలోని సెక్షన్ 20 (2)లోని నియమాల ప్రకారం, ఇటువంటి క్లెయిము ఉద్యోగి స్వయంగా దాఖలు చేయవచ్చు లేదా ఎవరైనా న్యాయవాది లేదా కార్మికుల పక్షాన నమోదిత ట్రేడ్ యూనియన్ అధికారి దాఖలు చేయవచ్చు.