ముగిసిన యాత్ర
సిరా న్యూస్,విశాఖపట్టణం;
పాదయాత్రతో లోకేష్ తనను తాను నిరూపించుకున్నారా? పరిణితి సాధించారా? నాయకత్వ పటిమను పెంచుకున్నారా? పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారా? ప్రజల్లో మార్పు తీసుకొచ్చారా? వారి మనసును గెలుచుకున్నారా? అంటే దీనికి మిశ్రమ జవాబులే వస్తున్నాయి. తనను తాను ఒక నాయకుడిగా ఆవిష్కరించుకున్న లోకేష్ సంచలనాలకు మాత్రం తెర తీయలేకపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం పాస్ మార్కులు దాటారే తప్ప.. శత శాతం సాధించలేకపోయారన్నది విశ్లేషకుల మాట.అయితే ఒక్కటి మాత్రం చెప్పగలం.. ఈ పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ ను అమాంతం మార్చేసింది. ఆయనపై వచ్చిన కామెంట్స్ కు సరైన సమాధానం చెప్పింది. తనలోనూ నాయకత్వ పటిమ ఉందని.. దానిని ఎవరూ నీరుగార్చలేరు అని మాత్రం లోకేష్ సమాధానం ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభం నుంచి అడ్డుకోవాలని చూడడం వాస్తవం. లోకేష్ ఎక్కడ తడబడితే దుష్ప్రచారానికి తెర తీయడం నిజం. కానీ తొలినాళ్లలో ఆ అవకాశం ఇచ్చిన లోకేష్.. అనతి కాలంలోనే తనను తాను సరిదిద్దుకున్నారు. తప్పిదాలకు చెక్ చెప్పారు. ఆటంకాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తన విషయంలో చులకనగా మాట్లాడిన ప్రత్యర్థులు, సొంత పార్టీ శ్రేణులకు సరైన సమాధానం చెప్పారు.లోకేష్ పాదయాత్ర చేస్తారంటే సొంత పార్టీ శ్రేణులే నమ్మలేదు. పైగా కామెడీ చేసిన వారున్నారు. లోకేష్ ప్రయత్నాన్ని నీరుగార్చాలని చూసినవారు ఉన్నారు. వైసీపీ అయితే వందలాదిమంది ప్రైవేట్ సైన్యాన్ని పంపించింది. ఇంటలిజెన్స్ వ్యవస్థను వినియోగించుకుంది. కానీ వాటన్నింటినీ అధిగమించి లోకేష్ పాదయాత్ర లక్ష్యాన్ని పూర్తి చేయడం గొప్ప విషయమే. తన పై వందల కోట్లు వెచ్చించి తప్పుడు ప్రచారానికి దిగిన వైసీపీకి సరైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు తర్వాత తనకు అవకాశం ఉందని నిరూపించుకున్నారు. ప్రజలకంటే పార్టీపై పట్టు నిలుపుకునేందుకు పాదయాత్రను ఒక వరం లా వినియోగించుకున్నారు.అయితే అనుకున్న స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోవడం మైనస్. మంచి వాగ్దాటి లేకపోవడం, సమయస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం లోటుగా మారింది.