స్వరం మారుస్తున్న కమలం

సిరా న్యూస్,రాజమండ్రి;
ఏపీ విషయంలో బిజెపి స్వరం మారుతుందా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందా? ఒంటరిగా పోటీ చేస్తే దారుణ ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? అందుకే సీట్లు, ఓట్లు పెంచుకునేందుకు ఆ పార్టీ సిద్ధపడుతుందా? టిడిపి, జనసేన కూటమిలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. వైసీపీతో మునుపటి సత్యతతో బిజెపి అగ్రనేతలు వ్యవహరించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ టూర్లు తగ్గిపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కేంద్ర పెద్దలతో సఖ్యతగా వ్యవహరించేవారు. సంక్షేమ పథకాలు అమలుకు పెద్ద ఎత్తున నగదు అవసరం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అమాంతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితికి మించి చేరుకున్నాయి. దీంతో ప్రతినెలా ఢిల్లీకి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారుల బృందం ప్రతినెలా చివరి వారంలో ఢిల్లీలో పడిగాపులు కాస్తుంటుంది. అదే సమయంలో సీఎం జగన్ అక్కడ ప్రత్యక్షమవుతారు. రుణాలు ఇట్టే మంజూరవుతాయి. అయితే గత రెండు నెలలుగా ఢిల్లీ టూర్లు జగన్ నిలిపివేయడంతో రకరకాలైన చర్చ నడుస్తోంది.ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ కు దగ్గరైనట్లు జాతీయస్థాయిలో ఒక ప్రచారం ఉంది. ఆ మధ్యన యూరప్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జగన్ కలిశారని ఒక వార్త హల్ చల్ చేసింది.ఇటీవల షర్మిల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ వైపు తాను చూస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికేనని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జగన్ భావించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ద్వారా షర్మిల ఎంట్రీ ని అడ్డుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కు జగన్ లో ఒక రకమైన మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాలన్నింటి పైన సమాచారం ఉన్న బిజెపి జగన్ ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు గానీ జగన్ కు చెక్ చెప్పకుంటే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అందించాలని.. ఏపీలో ఓట్లు సీట్లు పెంచుకోవాలని భావిస్తున్నట్లు బిజెపి నేతలు కొందరు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఏపీలో వైసీపీకి గడ్డు రోజులు వచ్చినట్టే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైతం ఇదే తరహా తప్పును చేసింది. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు ఆ వంతు వైసీపీకి వచ్చింది. మరోవైపు ఎన్నికల సమీపిస్తుండటంతో.. ఒంటరిగా పోటీకి వెళ్లాలా? టిడిపి, జనసేన తో కలిసి పోటీ చేయాలా? అని తేల్చాల్సిన అనివార్య పరిస్థితి కూడా ఎదురైంది. దీంతో కూటమి వైపు బిజెపి మొగ్గు చూపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *