సౌత్ లో బలానికి కమల వ్యూహాలు

సిరా న్యూస్;

బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్ర పడిపోయింది. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే తేలింది. అందుకే, దక్షిణాది నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించినట్టు చెబుతున్నారు. అందుకు తమిళనాడునే ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్‌ కొత్త భవనంలో ప్రధాని మోదీ ఓ రాజదండాన్ని పట్టుకొచ్చి పెట్టారు. అది చోళరాజ వంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. వారణాసిలో తమిళ-కాశీ సంఘం ఉత్సవాలు జరిగాయి. మామూలుగా కాదు.. నెల రోజులపాటు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. వారణాసి.. ప్రస్తుతం ప్రధాని మోదీ నియోజకవర్గం. మొన్నామధ్య తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా.. ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఏదో ఒక రోజు భారత ప్రధానిగా తమిళుడిని చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఏ సిగ్నల్స్‌ పంపుతున్నాయి? వీటన్నింటిని డీకోడ్‌ చేస్తే తేలేది ఒక్కేట. ఈసారి దక్షిణాది నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలనుకుంటున్నారని. దక్షిణాదిపై, అందులోనూ తమిళనాడుపై ప్రధాని మోదీ ఫోకస్‌ ఇప్పటిది కాదు.. కొన్నాళ్ల నుంచే ఉందని ఈ చర్యలన్నీ చెబుతున్నాయి. అంటే, చాలా ప్లాన్డ్‌గా తమిళనాడుకు సంబంధించిన వ్యవహారాలు చేస్తూ వస్తోంది బీజేపీ. ఈమధ్య తమిళనాడుకు ఎక్కువగా వస్తున్న ప్రధాని.. వీలైనప్పుడల్లా తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమిళ ప్రధాని అనే అమిత్‌షా మాటలకు మరో అర్థాన్ని వెతుకుతున్నారు. మోదీ ఈసారి తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని, అక్కడ ఎంపీగా గెలిస్తే తమిళనాడు ఎంపీనే పీఎం అయినట్టు, తమిళుడే ప్రధాని అయ్యారనే ఫీలింగ్‌ ఉంటుందని చెబుతున్నారు. ఈ యాంగిల్‌ అసలు ఎవరూ ఊహించనిది కూడాసరే.. తమిళనాడు నుంచే పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు? రామేశ్వర క్షేత్రం ఉన్న రామనాథపురం నుంచి లోక్‌సభకు పోటీచేయొచ్చనేది బీజేపీలో జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే, కాశీ ఎంపీగా ఉన్నారు. కాశీ-రామేశ్వరం మధ్య ఎలాంటి బాండింగ్‌ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే, ఈ నియోజకవర్గం ఎంచుకోబోతున్నారని చెబుతున్నారు. పైగా రామేశ్వరం నుంచి పోటీ చేస్తే బీజేపీకి మంచి జోష్‌ వస్తుంది. కాశీ-రామేశ్వరం, రాముడి సెంటిమెంట్‌ బాగా పనిచేస్తుంది. పైగా దక్షిణాదిన ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. అయితే, రామనాథపురంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. బీజేపీ అంతర్గతంగా చేసిన ఓ సర్వేలో.. రామనాథపురంలో బీజేపీకి ఆశించిన స్థాయిలో బలం లేదని తేలింది. మరీ ముఖ్యంగా బూత్ లెవెల్‌ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి లీడర్‌షిప్‌ లేకపోవడం అతిపెద్ద సమస్యగా చెబుతున్నారు. పైగా రామనాథపురం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నేత ఎంపీగా ఉన్నారు. ఈ పార్టీకి డీఎంకే సపోర్ట్‌ చేస్తోంది. సో, రామనాథపురం అంత ఈజీ కాదన్న ప్రచారం జరుగుతోంది.రామేశ్వరం కాకపోయినా.. తమిళనాడులోనే మోదీకి మరో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కన్యాకుమారి, మరొకటి కోయంబత్తూర్. ఆల్రడీ.. కన్యాకుమారి ఎంపీ పొన్ రాధాకృష్ణన్, కోయంబత్తూర్ ఎంపీ సీపీ రాధాకృష్ణన్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలే. 2019 ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను గెలిచింది బీజేపీ. దీంతో ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే.. కచ్చితంగా గెలుస్తారనే రిపోర్ట్స్‌ అందాయి. దక్షిణాది అంటే తమిళనాడు ఒక్కటే కాదు.. మొత్తం ఐదు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, కేరళ కూడా ఉన్నాయి. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే.. గెలవగలిగే స్థానాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ లాంటి స్థానాలున్నాయి. అయితే, ఈ లిస్టులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గం సికింద్రాబాద్‌ కూడా వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే విశాఖపట్నం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే మోదీ గెలుపు ఖాయమే. కాకపోతే, పోటీ చేసేందుకు మరిన్ని ఆప్షన్స్‌ వెతుకుతున్నారు. కర్నాటకలో బీజేపీకి బలం ఉంది. ఈమధ్య జేడీఎస్‌తోనూ పొత్తు పెట్టుకుంది. కాకపోతే, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కర్నాటక నుంచి పోటీ చేయాలన్న ప్లాన్‌ మారిందని చెబుతున్నారు. ఇక మిగిలింది కేరళ మాత్రమే. బీజేపీ చేసిన సర్వేల్లో కేరళలో పోటీ అంత ఈజీ కాదని తేలింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో గెలుపు సాధ్యమైనంత తేలిగ్గా కేరళలో ఉండదని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *