Magistrate Durga Rani: నడవలేని బాధితుల కోసం… నడిచి వెళ్లిన కోర్టు…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

Magistrate Durga Rani: నడవలేని బాధితుల కోసం… నడిచి వెళ్లిన కోర్టు…

ఇంగ్లీష్‌లో ‘జస్టిస్‌ డిలేడ్‌ ఈజ్‌ జస్టిస్‌ డినైడ్‌’ అంటారు. అంటే బాధితులకు న్యాయం అందించడంలో కాలయాపన చేయడం అంటే, బాధితులకు న్యాయం అందించక పోవడంతో సమానమేనని దీని అర్థం. బాధితులకు న్యాయం అందించడంతో పాటు, న్యాయాన్ని సకాలంలో అందించడం కూడా అత్యంత ముఖ్యమైందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో కోర్టుల్లో పెండింగ్‌ కేసులు పేరుకుపోతున్న ఈ తరుణంలో, న్యాయం అందడంలో కొంత జాప్యం తప్పదనే చెప్పవచ్చు. అయితే ఒక కేసులో బాధితులు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు నడిచి రాలేని స్థితిలో ఉంటే, స్వయంగా కోర్టే వారి వద్దకు వచ్చి సాక్ష్యాన్ని రికార్డ్‌ చేసిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన సముదాయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… తలమడుగు పోలీస్‌ స్టేషన్‌లో జామిడి గ్రామానికి చెందిన మునేశ్వర్‌ రాంబాయి, భగత్‌ సులోచన 2017లో వేరే ఇద్దరిపై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం వారు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాగా, ఆటో దిగి నడిచి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితిలో లేరని కోర్టు కానిస్టేబుల్‌ సంతోష్‌ పీసీఆర్‌ కోర్టు న్యాయమూర్తి టి దుర్గా రాణికి విన్నవించడం జరిగింది. దీంతో వారి దుస్థితిని అర్థం చేసుకున్న కోర్టు స్వయంగా కోర్టు బయటకు వచ్చి, ఆటోలో వారు కూర్చున్న చోటనే పీపీ నవీన్‌ కుమార్, ముద్దాయిల తరపు న్యాయవ్యాది అమరేందర్‌ రెడ్డిల సమక్షంలో బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేసారు. కాగా కోర్టుకు రాలేని బాధితుల చెంతకు స్వయంగా కోర్టే తరలిరావడం అనేది చారిత్రాత్మకమని కోర్టు లైసన్‌ ఆఫీసర్‌ గంగా సింగ్‌ మీడియాకు తెలిపారు. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచడంతో పాటు బాధితులకు సకాలంలో న్యాయం అందించడానికి సైతం ఎంతగానో దోహదపడుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసారు.

బాధితులు వాం నమోదు చేస్తున్న పీసీఆర్ కోర్టు న్యాయమూర్తి టి. దుర్గా రాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *