సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ రూరల్ మండలంలోని ముజ్గి గ్రామంలో మూడవ రోజు ముజ్గి మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమీర్పించి నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అదేవిధంగా నిలువెత్తు బంగారం( బెల్లం) సమర్పించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.