సిరా న్యూస్,హైదరాబాద్;
మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం బీజేపీలోని కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఇక్కడ్నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సీటు ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడుతున్నారు.మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వాల్ పోస్టర్లు అతికించడంతో పాటు ఎన్నికల ప్రచార రథాలను పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తిప్పుతున్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే పలువురు నేతలు ఎన్నికల ప్రచారాన్ని మురిపించేలా కార్యక్రమాలను చేపట్టడంపై ద్వితీయ శ్రేణి నాయకులు,కేడర్ ను అయోమయం లో ముంచేస్తుంది.ఇటీవల ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో లోక్ సభ అభ్యర్థుల విషయంపై రాష్ట్రా ఎన్నికల కమిటీ సభ్యులు డీకే అరుణ, మురళీధర్ రావు ,బండి సంజయ్,ఈటల రాజేందర్ ,గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి సంస్థ గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు సమావేశం అయ్యారు. ఇందులో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం దరఖాస్తులను పరిశీలించగా…….ఇందులో మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు నేతలు గ్రహించారు. ఈ సీటు కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గట్టిగా పోటీ పడుతున్నారు.తనకున్న రాజకీయ అనుభవం,ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి టికెట్ తనకే ఇవ్వాలని అగ్రనేతలను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఇదే సీటును బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకు ఉన్న అంకితభావం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మాజీ ఎంపీ చాలా సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ,బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య,బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.దీంతో ఈ స్థానం లో ఎవరిని బరిలోకి దింపాలనేది బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్ ,కంటోన్మెంట్ ఉండగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అంతటా బిఆర్ఎస్ విజయం సాధించగా……బీజేపీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్ లో బీజేపీ పార్టీకి గతంలో పోల్చితే ఓటు శాతం పెరగడంతో తప్పకుండా మల్కాజిగిరి స్థానం కాషాయ మయం అవుతుందనే నమ్మకం నేతల్లో బలంగా ఉంది.అందుకే ఈ సీటు పై ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఆశావహులు పార్టీ అధిష్టానంతో పాటు ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు నేతలు ప్రచార ప్రయత్నాలు మొదలు పెట్టారు.పార్టీ జాతీయ నాయకుడు మురళి మురళీధర్ రావు అయితే ఏకంగా ఎన్నికల ప్రచార రథాన్ని మల్కాజిగిరి పరిధిలో దింపుతున్నారు. పార్టీ అధిష్టానం ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ ఆశావహులు మాత్రం ఎవరికీ వారే టికెట్ తమకే నని ధీమా వ్యక్షం చేస్తున్నారు.ఇదిలా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ పై స్థానిక పార్టీ నాయకులు మాత్రం లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానంపై కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, మధ్యప్రదేశ్ పార్టీ ఇంచార్జ్ మురళీధర్ రావు, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య లు ప్రచారాలు నిర్వహిస్తుండడంతో స్థానిక నేతలు,కేడర్ అయోమయానికి గురవుతున్నారు.బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు కొన్నాళ్లుగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూ…….కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం, మరికొందరు నాయకులు ఫ్లెక్సీ , వాల్ రైటింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టడం స్థానిక నేతలను ఆందోళనకు గురి చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కీలక పార్లమెంట్ స్థానంలో ఇంత మంది ఆశావహులలో టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి