సిరా న్యూస్;
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కొసం భూక్తి కొసం వెట్టిచాకిరి విముక్తి కొసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు భాసిన తొలి అమరుడు మన దొడ్డి కొమురయ్య
-నేడు ఆయన జయంతి
( పెండ్యాల రామ్ కుమార్, మంథని )
హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. 03 ఏప్రిల్ 1927లో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబములో జన్మించాడు. ఇతని అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ గ్రామ నాయకుడు. విసునూర్ దేశ్ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది. వెట్టి చాకిరికి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్ ల ఆటలను అరికట్టించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు.1946 జులై 2 న విసునూర్ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. కడివెండి గ్రామంలో 1946 జులై 4న దేశ్ముఖ్ తొత్తులకు, రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటు లేవదీసింది. మల్లయ్య, కొమురయ్య నాయకత్వంలో ఆ తిరుగుబాటు ముందుకు సాగింది. మల్లయ్య, కొమురయ్యలను మట్టుబెడితే ఉద్యమం ఆపేయవచ్చునని జానకమ్మ దొరసాని ఆలోచించింది. దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా గడీ దగ్గరకు ర్యాలీ రాగానే రజాకార్లు, దొర బంట్లు గడీ లోపలి నుంచి జనంపైకి కాల్పులు జరిపారు. తొలుత దొడ్డి మల్లయ్య మోకాళ్లలో, మంగళి కొండయ్య నుదుట, దొడ్డి నర్సయ్య మోచేతి గుండా తూటాలు వెళ్లాయి. దొడ్డి కొమురయ్య పొట్టను చీల్చుకుంటూ తూటాలు పోవడంతో రక్తపు మడుగులో అతను నేలకొరిగాడు. కొమురయ్య రక్తంతో అక్కడి నేలంతా తడిచింది. నైజాం అల్లరి మూకలు, విసునూర్ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతారగా తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగాం ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్ముఖ్, విసు నూర్ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం బయలుదేరింది. అప్పటి వరకూ శాంతియుతంగా సాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్తా కొమురయ్య అమరత్వంతో రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మారింది. కొమురయ్య మరణంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పోటెత్తడంతో దొరల గడీ నేలమట్టమైంది. కొమురయ్య త్యాగంతో మొదలైన పోరాటం హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్ర మహాసభ కమ్యునిస్టు పార్టీగా అవతరించింది. ఎందరో నేతలు రైతులతో భుజంభుజం కలిపి తుపాకులు పట్టారు. దున్నే వాడిదే భూమి నినాదం మార్మోగింది. లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచబడ్డాయి.