సిరా న్యూస్;
బిజెపి పరిస్థితి మరింత దిగజారనుందా? ఆ పార్టీ బలం క్రమేపీ తగ్గిపోతుందా? 2029 ఎన్నికల్లో కమలం పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమా? కాషాయ దళానికి మిత్రులు సైతం కరువు అవుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా అధికారంలోకి రాగలిగారు. నెలరోజుల తిరగకముందే అసెంబ్లీ ఉప ఎన్నికల రూపంలో బిజెపికి గట్టి షాక్ తగిలింది. దానికి మించి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కూడా.. ఆ పార్టీని కలవరపెడుతోంది. మున్ముందు ఇలాంటి ఓటములు తప్పవని సంకేతాలు వస్తుండడంతో ఆందోళన నెలకొంది.ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడడంలో బిజెపి చేసిన రాజకీయం అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘకాలం నమ్మదగిన మిత్రుడిగా ఉన్న నవీన్ పట్నాయక్ ను దారుణంగా దెబ్బతీసింది బిజెపి. 2000 నుంచి 2024 వరకు బిజెపిని చాలా గౌరవించారు. బిజెపి నాయకత్వానికి ఎదురెళ్లిన దాఖలాలు కూడా లేవు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా.. కష్టంలో ఉన్నప్పుడు మాత్రం అండగా నిలిచారు. కానీ అదే నవీన్అనారోగ్యానికి గురయ్యారని.. ఆయనకు పాలన చేతకాదని చెప్పుకొచ్చారు. శ్రీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరవలేని అసమర్ధుడని ముద్రవేశారు. దేశంలోనే ఒక ఔన్నత్యమైన ముఖ్యమంత్రిని పదవి నుంచి దూరం చేశారు.భారతీయ జనతా పార్టీ చేసిన రాజకీయం పుణ్యమా అని మహారాష్ట్రలో రెండు శివసేన పార్టీలు, రెండు ఎన్సీపీలు పుట్టుకొచ్చాయి. ఆ రెండు పార్టీలను చీల్చి.. వాటి డూప్లికేట్స్ కు అసలైన హోదా కల్పించారు. అసలైన పార్టీలు అంత వేగంగా నిర్వీర్యం అవుతాయి అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒక వ్యక్తి, కుటుంబం మీద ఆధారపడి ఉంటాయి. వేరే వారికి ఆ పార్టీని కట్టబెట్టినంత మాత్రాన ప్రజలు మారిపోరు. ఇప్పుడు మహారాష్ట్రలో కనిపిస్తుంది అదే. బిజెపి పట్ల మొన్నటి వరకు సానుకూలత ఉన్నా.. తమ రాష్ట్రంలో రాజకీయంగా వ్యవహరించిన తీరుప్రజలు గ్రహించారు. వచ్చే నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో తమ శక్తి యుక్తులను చూపించనున్నారు. మహారాష్ట్రలో బిజెపి చేసిన రాజకీయం కారణంగా అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉద్దవ్ నేతృత్వంలోని అసలైన శివసేన, శరద్ పవర్ నేతృత్వంలోని అసలైన ఎన్సిపి మళ్లీ పట్టు నిరూపించుకున్నాయి.మహారాష్ట్రలో విపక్షాల ఐక్యతకు బిజెపి చర్యలే కారణం. వచ్చే ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా పోటీకి కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. షిండే ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూలత లేదని పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి. అందుకే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించింది. సానుకూలంగా సర్వేలు సైతం వస్తున్నాయి. కేవలం బిజెపి కుటిల రాజకీయాల కారణంగా దారుణ దెబ్బ తగలడం ఖాయం. ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలతో దేశంలో బిజెపి పతనం ప్రారంభం అవుతుందని విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. అందుకే ఇప్పుడు మోదీజాగ్రత్తగా నడుచుకుంటున్నారు.మిత్రులతో సఖ్యతగా గడుపుతున్నారు. అయితే మూడోసారి అధికారంలోకి రావడంతో వ్యతిరేకత సాధారణమని.. దానిని అధిగమించగలమని బిజెపి చెబుతోంది.బిజెపికి ఇప్పుడున్న మిత్రులు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరచు కూటమిలను మార్చుతుంటారు. ఆయనకు ప్రధానమంత్రి పదవి చేయాలని బలంగా ఉంది. అది వీలు కాకపోవడం వల్లే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి వచ్చారు. బీహార్అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన తప్పకుండా బిజెపికి ఎదురు తిరుగుతారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం బిజెపిని నమ్మడం లేదు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగానే ఆయన ఎన్డీఏతో సఖ్యతగా ఉన్నారు. తనను నమ్మిన ప్రాంతీయ పార్టీలను బిజెపి ఏ స్థాయిలో మోసం చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రస్తుతం మిత్రులు సైతం అంటీ ముట్టనట్టుగా మాత్రమే ఉన్నారు. మహారాష్ట్రలోప్రతికూల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి బిజెపి గ్రాఫ్ గణనీయంగా తగ్గుముఖం పట్టడం ఖాయం.కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే.. గత పదేళ్లలో బిజెపి బాధిత పార్టీలన్నీ హస్తం గూటికి చేరడం ఖాయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీఅధికారానికి దగ్గరగా వస్తే.. బిజెపి పతనం ప్రారంభం కావడం ఖాయం. అయితే ఇప్పటివరకు ఉత్తరాధి రాష్ట్రాలనే బిజెపి నమ్ముకుంది.ఇప్పుడు అదే రాష్ట్రాల్లో బిజెపికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. చివరకు బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ప్రతికూల ఫలితాలు రావడం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి మిత్రులు చాలా తక్కువ.బిజెపికి నమ్ముకున్న చాలా పార్టీలు మూల్యం చెల్లించుకున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ ఇదే మాదిరిగా మూల్యం చెల్లించుకున్నారు. నమ్మదగిన మిత్రులుగా ఉన్నటువంటి పార్టీలనే విభజించింది బీజేపీ. ఏకంగా నాయకత్వాలపై తిరుగుబాటు చేయించింది. అందుకే బిజెపితో స్నేహం అంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు ఏర్పడింది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దేశంలో బిజెపి గ్రాఫ్ పడిపోతున్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా పదేళ్ల కిందట అంతులేని గ్రాఫ్ తో ప్రధానిగా ఎంపికయ్యారు మోడీ. కానీ దశాబ్ద కాలంలో పరిస్థితి తారు మారయ్యింది.