ఇంకా పూర్తికాని మేడారం పనులు

సిరా న్యూస్,వరంగల్,
మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర సమీపిస్తోంది. మరో 20 రోజులే గడువు ఉంది. దీంతో అధికారులు నిత్యం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా పనులు జరుగుతూనే ఉన్నా.. ఇంకా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. సౌకర్యాలు కానరావడం లేదు. మరో పక్షం రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే తిప్పలు తప్పవంటున్నారు భక్తులు.
ప్రధాన సమస్యలివీ..
మూడు నెలలుగా పనులు చేస్తున్నా.. ఇప్పటికీ మేడారంలో కనిపిస్తున్న ప్రధాన సమస్యలు ఇలా ఉన్నాయి.
– భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో ఇంకా వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు.
– భక్తుల స్నానాలకు జంపన్న వాగులోకి ఇప్పటికీ శుభ్రమైన నీరు విడుదల చేయలేదు.
– ట్రాఫిక్‌ నిర్వహణ సక్రమంగా జరుగడం లేదు. జాతర ప్రారంభం కాకముందే వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయి.
– జాతరలో తల్లులకు బలి ఇచ్చే జంతువుల వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు. వాటిని శుభ్రం చేయడం లేదు.
– వృద్ధులు, చిన్న పిల్లలు, వీఐపీల దర్శనాలకు ఏర్పాట్లు చేయలేదు.
ట్రాఫిక్‌ ప్రధాన సమస్య..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజతర సమీపిస్తోంది. జాతరకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే తల్లులను దాదాపు 25 లక్షల మంది దర్శించున్నారు. అయితే జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్య ఇబ్బందిగా మారింది. వాహనాలు తరచూ నిలిచిపోతున్నాయి. జాతరకు ముందే ఇలా ఉంటే జాతర నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
టోల్‌గేట్‌ కష్టాలు..
హైదరాబాద్‌ నుంచి వచ్చేవారిని టోల్‌గేట్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వారు నాలుగు టోల్‌గేట్లు దాటాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. మరోవైపు టోల్‌ భారం రూ.550 వరకు పడుతుంది. యాదాద్రి జిల్లా గూడూరు, జనదామ జిల్లా కోమల్ల, హనుమకొండ జిల్లా కోమటిపల్లి, ములుగు జిల్లా జవహర్‌నగర్‌ వద్ద టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. వాహనాలు స్థాయిని బట్టి రూ.200 వరకు టోల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఏటూరు నాగారం, తాడ్వాయిలో ఏటూరు నాగారం వద్ద అటవీశాక చెక్‌పోస్టులు ఏరాపటు చేసింది. పర్యావరణ పరిరక్షణ చార్జీల పేరుతో వీళ్లు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక మేడారంలో పంచయతీ సిబ్బంది, పార్కింగ్‌ సిబ్బంది కూడా అదనంగా రుసుము వసూలు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *