సిరా న్యూస్, హైదరబాద్:
ఇక ప్రతీ ఊర్లో మీ సేవా కేంద్రం… రేవంత్ సర్కార్ నిర్ణయం
ఆన్లైన్ సేవలతో పాటు వివిద రకాల చెల్లింపులు, సర్టిఫికేట్లు, ఆధార్, దరఖాస్తు సేవలను విస్తృతంగా అందిస్తున్న మీ సేవా కేంద్రాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఆగస్ట్ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీయికి ఒకటి చొప్పున మీ సేవా కేంద్రాలను మంజూరు చేసేందుకు సుముఖత తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4500లకు పైగా మీ సేవా కేంద్రాలు సేవలందిస్తున్నాయి. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో 12,769 గ్రామ పంచాయతీల్లో ఈ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
మహిళ శక్తి పథకంలో భాగంగా…
మహిళ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మీ సేవా కేంద్రం సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో మహిళ శక్తి పథకంలో భాగంగా ఈ కేంద్రాలను ప్రభుత్వం గ్రామైక్య సంఘాల పేరిట మంజూరు చేయనుంది. దీంతో పాటు కేంద్రం ఏర్పాటుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, బయోమెట్రి డివైస్, ఇంటర్నెట్ రూటర్లు, తదితర పరికరాల కొనుగోలుకు రూ. 2.50లక్షల రుణం సైతం స్త్రీనిధి ద్వార ప్రభుత్వం మంజూరు చేయనుంది. తరువాత ఈ రుణాన్ని నెల వాయిదా పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే సంఘంలో ఇంటర్ పూర్తి చేసిన మహిళలను ఆపరేటర్గా ఎంపిక చేసి, నెల రోజుల పాటు శిక్షణ కూడ అందించనున్నారు. దీంతో మహిళ సంఘాలకు కొత్త ఆర్థిక వనరులు, ఉపాధి లభించడంతో పాటు ప్రజలకు సైతం గ్రామాల్లోనే మీ సేవా సేవలు అందుబాటులోకి రానున్నాయి.