-బాల కార్మికులపై జాలి లేదాయే
-బలపం పట్టాల్సిన చేతులతో ఇటుకలు మోస్తున్న వైనం
-నిదురపోతున్న జిల్లా యంత్రాంగం
-నిప్పుల కుంపటిలో రక్తపు చెమటలు
-వసతులు కల్పించని ఇటుకబట్టిల యజమాన్యం
సిరా న్యూస్,పెద్దపల్లి;
వలస బతుకులకు వెట్టి తప్పదనుకుంటే… పోనీ బాల కార్మికులతో పనులు చేయించు కోవద్దని చట్టాలు, ప్రభుత్వం బలంగా చెపుతున్నా అధికారులు కళ్ళు మూసుకొని కార్యాలయంకు పరిమితం అవుతున్నారు. వారిపై జాలి చూపే నాథులు లేకపాయే.. బలపం పట్టాల్సిన చేతులతో ఇటుకలు మోస్తున్న వారికి చదువు లేక వారి తల్లితండ్రుల మాదిరి ఈ ఇటుక బట్టీల్లో జీవితం మగ్గి పోవలిసిందేనా… నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలో ఆ అమాయక కార్మికులు రక్తపు చెమటలు చిందిస్తుంటే యాజమాన్యం మాత్రం వారికి ఎలాంటి వసతులు కలిపించలేదు కదా, వారు మాత్రం ఏసీల్లో సేద తీరుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే ఈ నెల ఐదున మండలంలోని రాఘవపూర్ రంగంపల్లి మధ్యలో గల ఓ ఇటుక బట్టీలో పనులు చేస్తున్న వలస కార్మికులతో పాటు బాల కార్మికులు కూడా కనిపించారు. ఫోటోలు తీస్తుండగా పిల్లలు అక్కడి నుండి జారుకోవడం కనిపించింది కొద్దిసేపు ఆ పరిసర ప్రాంతాలను గమనించగా అక్కడ కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు ఆ నిప్పుల కుంపటి కురిపిస్తున్న ఎండలో వారు చేస్తున్న పనులు దయగలవారి ఎవరి కళ్ళు అయినా చెమర్చక తప్పదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎండల విషయంలో తగిన సూచనలు సలహాలు అందిస్తున్న ఇక్కడ వీరికి మాత్రం ఎలాంటి వి వర్తించదనే చెప్పాలి. మరి ఇటుక బట్టీల యాజమాన్యంకు వేరే చట్టాన్ని అమలు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇటు వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఈ ఇటుక బట్టిలపై ఏ అధికారి దృష్టిసారంచకపోవడం శోచనీయం. జిల్లా కార్మిక, ఆరోగ్య శాఖ అధికారు లతోపాటు పలు శాఖల అధికారులు ఈ విషయంలో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు పైగా ఇటుకబట్టి యాజమాన్యాల ధన బలం ముందు అధికారులు తేలిపోతున్నారనే విషయం పలు సందర్భాల్లో తేటతెల్లమైంది కూడా. గతంలో కార్మికులపై జరిగిన దాడులకు విసిగెత్తి ఇక్కడి నుండి వెళ్ళిపోయిన సందర్బాలు అనేకం ఉన్నాయి. కానీ అక్కడ పనులు లేక పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి రాక తప్పడం లేదు. అయితే
వీరికి అనుకూలంగా ఉన్న చట్టాలతో కార్మికులను సమయ పాలన లేకుండా తీవ్రమైన ఎండల్లో పనులు చేయించుకుంటున్నారు. వీరి కోసం పోరాటం చేస్తున్న పలు సంఘాలు ఉన్నా, వీరికి ఎలాంటి న్యాయం జరగడం లేదు. అందరూ చట్టాలను అనుకూలంగా మార్చుకుంటున్నారే కానీ వీరికి మాత్రం ఫలాలు అందించడంలో ఒక అడుగు వెనకనే వుంటున్నది. నిత్యం వందలాది కార్మికులు రోగాల బారిన పడి లేవలేని పరిస్థితుల్లో ఉన్నా వాళ్లకు సరైన వైద్యం అందించడంలో యాజమాన్యాలు విఫల మవుతున్నారనడానికి ఇదివరకు జరిగిన కొన్ని మరణాలే సాక్ష్యం. మరణాలను, హత్యలను కప్పిపుచ్చడంలో కూడా మన ఇటుక బట్టీల యాజమాన్యాలకు అలవాటైన విషయం అందరికి విదితమే. కార్మికులకు పంచభక్ష పరమాన్నం లేకున్నా ఉండేందుకు కనీస సౌకర్యాలు, తమ పిల్లలకు కాసింత చదువు. వీటిని బట్టీల యాజమాన్యం కలిపిస్తే వారే దేవుళ్ళు అంటారేమో ఈ అమాయకుపు వలస కార్మికులు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
==================