సిరా న్యూస్,మహబూబ్ నగర్;
ప్రసిద్ది చేందిన పిల్లలమర్రిని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పున:ప్రారంభించారు. బుధవారం నుంచి సందర్శకులకు అనుమతి ఇచ్చారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ 👉పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం. టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు.
తూర్పు మధ్య ఆసియా దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలు మనదేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి అన్నిటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిజం కేంద్రాలలో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. టూరిజంకు మార్కెట్ కల్పించనున్నాం. యాంత్రిక జీవనంలో టూరిజం వల్ల వినోదం కలుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే రూ 5 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నాం. ఆసియా ఖండంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలుగాంచిన పిల్లలమర్రి చెట్టును పర్యటకులకు ఈరోజు నుండి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నాం. ముఖ్యంగా నల్లమల అభయారణ్యం, మల్లెల తీర్థం, సోమశిల ,సరళసాగర్, కోయిల్ సాగర్ తో పాటు, ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి గల కృష్ణానది ఉంది. కృష్ణ బ్యాక్ వాటర్ లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తాం. రామప్ప గుడి, పాండవుల గుట్ట, గోల్కొండ వంటి ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నాయి. ప్రతి ఒక్కరు నెలలో కనీసం ఒక్కసారైనా మానసికొల్లసం కోసం పర్యాటక ప్రాంతాలు సందర్శించాలి. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో పాటు, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, మహబూబ్ నగర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.