సిరా న్యూస్,నల్గోండ;
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లోపు పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేబినెట్ బెర్త్ కోసం ఆశవాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం కేబినెట్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరికి చోటు దక్కచ్చు అనేదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించేనా..? హాట్ టాపిక్గా మారింది. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి అడ్డంకిగా మారుతుందా..? పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన మంత్రి పదవి హామీని అధిష్టానం నిలబెట్టుకుందా..? ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో మంత్రి పదవి దక్కుతుందా..? మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు ఎలా ఉన్నాయి..? అన్న జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్, పార్లమెంటు ఎన్నికల్లోనూ తడాఖా చూపించాలని భావిస్తోంది. ఇందు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలతో పార్లమెంట్ ఎన్నికల్లో క్లిన్ స్విప్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. వీరిలో కోదండరాంను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. దీంతో బడ్జెట్ సమావేశాల్లోపు పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరణకు సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారట. ఈ నెలాఖరులోపు కసరత్తును పూర్తి చేసి అధిష్ఠానం ఆమోదంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కేబినెట్ను విస్తరించనున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం సీఎం సహా కేబినెట్లో 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి విస్తరణలో ఛాన్స్ దక్కనుంది. కాగా ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఈసారి అవకాశం దక్కవచ్చని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, కోదండరాం, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్కు కేరాఫ్ అడ్రస్గా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా, ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి, తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి 2023లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. ఇప్పటికే రేవంత్ మంత్రి వర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.అయితే సతీమణి లక్ష్మీకి భువనగిరి పార్లమెంటు టికెట్ ఆశించిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసమే ఎంపీ టికెట్ బరి నుండి కూడా తప్పుకున్నారట.