సిరా న్యూస్, పెద్దపల్లి:
చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరి
– ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పోలియో సోకకుండా చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఆదివారం విజయరమణ రావు మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లలకు పోలియో చుక్కలు వేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం ప్రతీ ఒక్కరి భాధ్యత అని అన్నారు. భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడినప్పటికీ కూడా మనమంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 381 కేంద్రాల్లో, 4040 పోలియో వాయిల్స్ అందుబాటులో ఉన్నట్లు ఆయన లితెలిపారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో సైతం 24 పోలియో ట్రాన్సిట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ కార్మికుల కోసం 149 ప్రాంతాలను గుర్తించి 24 మొబైల్ బృందాల ద్వారా పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో వెంకటేశ్వర్లు, సంభందిత వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.