సిరా న్యూస్, లోకేశ్వరం:
దశలవారీగా సమస్యల పరిష్కారం…
–ఎమ్మెల్యే రామారావు పటేల్
గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిద శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల పనితీరు, చేపట్టిన కార్యక్రమాలను గురించి అడిగి తెల్సుకున్నారు. కాగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొందని సర్పంచ్లు, ఎంపిటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమి, సాగు నీటి సమస్యలను గురించి ఎమ్మెల్యేకు విన్నవించారు. కాగా క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీవో సాల్మన్ రాజ్, మిషన్ భగీరథ డీఈ ఆదిత్య, సర్పంచ్లు, ఎంపిటీసీలు పాల్గొన్నారు.