సిరా న్యూస్, ఉట్నూర్
విద్యాతోనే సమాజంలో గుర్తింపు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కళాశాలలో వన మహోత్సవం
విద్యాతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులు,విద్యార్థులు, మండల నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. చెట్లతోనే మానవ జీవనం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచంలో వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూకాలుష్యం జరగడానికి మనిషే కారణమని, తన స్వంత స్వలాభం కోసం చెట్లు నరికి వేస్తున్నాడని అన్నారు. కావున యేథేచ్చగా చెట్లను నరకకూడదని సూచించారు.ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని చదువును మధ్యలో ఆపకూడదని విద్యార్థులకు సూచించారు. పట్టుదల, కసితో చదివితే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను పెట్టుకోని ఇంజనీర్లు,శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు కావాలని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రవేటు రంగాలలో రాణించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యాకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించి, వినతిపత్రం అందజేశారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.