సిరాన్యూస్, ఉట్నూర్
పేదల ఆకలిని తీర్చేందుకే బొజ్జన్న బువ్వ: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* నూతన భవనాన్ని ప్రారంభం
* ప్రజలతో కలసి భోజనం చేస్తూ సమస్యలను తెలుసుకొని
సుదూర ప్రాంతాల నుండి ఐటీడీఏ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల కోసం ప్రతి సోమవారం బొజ్జన్న బువ్వ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలకు భోజనాన్ని వడ్డీంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో తాను ఎన్నికల ముందు నుంచే బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.పేదల ఆకలిని తీర్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.అన్నదానం మహాదానమని ఇక్కడ రాజకీయాలు చేయొద్దని కోరారు.ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తాను బ్రతికి ఉన్నంత కాలం బొజ్జన్న బువ్వ కార్యక్రమం ఇలాగే నిర్విరామంగా కొనసాగుతూ ఉంటుందని తెలిపారు.ప్రతి సోమవారం నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ఆర్డిఓ,ఎంఆర్ఓ,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదములు తెలిపారు.