సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
ఆయన ఓ వైద్యుడు. ఇప్పుడు ఎమ్మెల్యే. అయినా వృత్తి ధర్మాన్ని మరువలేదు. వైద్యుడిగా వృత్తి ధర్మాన్ని నేరవేర్చారు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్నారు. వెంబడే ఆసుపత్రికి చేరుకున్న ఆయన గర్భిణికి శస్త్ర చికిత్స చేసారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లింగాల మండల పరిధిలోని జిలుగుపల్లి గ్రామానికి చెందిన బోయ ప్రసన్న పురిటి నొప్పులతో అచ్చంపేట సివిల్ ఆసుపత్రికి వచ్చింది. సాధారణ ప్రసవం కోసం అక్కడున్న నర్సులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. గర్భంలో ఉన్న శిశువు మెడకు పేగు చుట్టుకోవడంతో వైద్యులకు హైరిస్కుగా అనిపించింది. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని గర్భిణీ కుటుంబీకులకు చెప్పారు. దాంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు వెంటనే ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆందోళన చెందవద్దని తాను సర్జనే కనక ఆస్పత్రికి వెంబడే వస్తునాన్ని చెప్పారు. ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న గర్భిణి బాధను తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తక్షణమే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమెను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి, శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంతో ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పడంతోకుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.