సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాన్వెంట్లో మాక్ పార్లమెంట్…
+ ఎంపీలుగా మారిన విద్యార్థులు
+ ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ
విద్యార్థి దశలో రాజకీయాలపై చాలా తక్కువ మంది అవగాహణ ఉంటుంది. అలాంటి విద్యార్థులు ఏకంగా తమ పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించి, ఔరా! అని పించారు. ఆదిలాబద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో మంగళవారం విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ప్రధానమంత్రిగా అభినవ్, స్పీకర్గా జూఫెర్, ప్రతిపక్ష నాయకురాలిగా నీలిమ, విద్యా శాఖ మంత్రిగా ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ కుమార్తె సుధా మాధురి వ్యవహరించారు. పార్లమెంట్లో జరిగే చర్చోపచర్చలు, ప్రశ్నోత్తరాలు, బిల్లులు ప్రవేశపెట్టడం వంటి చర్యలు కళ్లకు కట్టినట్లు చూపించారు. కాగా విద్యార్థులకు పార్లమెంట్, బిల్లులు, చట్టాలు, ఎంపీల విధులు, బాధ్యతల గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ రోజ్ మెరియా తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ లిజాంటో, ఉపాధ్యాయులు రవీంద్ర, వినోద్, మహేందర్, జెస్సీ, వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.