సిరా న్యూస్, ఆదిలాబాద్:
కంది శ్రీనివాస రెడ్డిపై చర్యలు తీసుకోండి…
+ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్
+ అడిషనల్ కలెక్టర్ శ్యామలకు వినతిపత్రం
కాంగ్రేస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జైనథ్ మండల ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ డిమాండ్ చేసారు. గురువారం ఆయన పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలను కలిసి, కంది శ్రీనివాసర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లిఖిత పూర్వకంగా వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా కంది శ్రీనివాస రెడ్డి ఇటీవల పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారని మండిపడ్డారు. ఏ హోదాలో ఆయన ఉపాధి హామీ సీసీ రోడ్లు, మురికి కాలువల పనులు ప్రారంభించారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఇది ముమ్మాటికి కంది శ్రీనివాస రెడ్డి అధికార దాహానికి నిదర్శనమని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ను కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సర్సన్ లింగారెడ్డి, కోల భోజన్న, తోట రమేష్, కుంచెట్టి కేశవ్, క్యాతం శివపప్రసాద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.