సిరాన్యూస్,భీమదేవరపల్లి
ములుకనూరులో దివంగత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
* కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని, రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్ స్పూర్తితో హత్ సే హాత్ జోడో యాత్ర చేసానని రాహుల్ గాంధీ ప్రకటించడం వైఎస్సార్ గొప్పతనానికి నిదర్శనమన్నారు. రాజశేఖర్ రెడ్డి 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఉచిత విద్యుత్, పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిల రద్దుపై తొలి, మలి సంతకాలు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసారని గుర్తుచేసారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆదరి రవీందర్, మాజీ వైస్ ఎంపిపి మాడుగుల ఎజ్రా, చిదురాల స్వరూప, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, మాజీ ఎంపిటిసి బొల్లంపల్లి రమేష్, పొన్నాల మురళి, బొల్లంపల్లి షడ్రేక్, గట్టు ప్రభాకర్, పూర్ణచందర్, పోల్సాని గోపాల్ రావు, కొమురయ్య, కుమారస్వామి, సతీష్, కళావతి, స్వర్ణలత, మంజుల, శారదా, సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.