ముందున్నది…మొసళ్ల పండుగ

సిరా న్యూస్;
ఛాయ్ తాగడం. సమోసాలు తినడం తప్ప ఆ కూటమి నేతలు చేసేదేమీ లేదు” అని ఆ మధ్య ఓ కీలక నేత ఇండియా కూటమిపై ఇలా సెటైర్లు వేశారు. పొలిటికల్ కామెంట్స్ ఇలానే ఉంటాయని అనుకున్నా…నిజంగా జరుగుతోంది అదే కావచ్చు అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు మరెన్నో నెలల సమయం లేదు. ఇప్పటి నుంచే యాక్టివ్ అయితే తప్ప మోదీ సర్కార్‌ని ఢీకొట్టడం సాధ్యం కాదు. అసలు ఈ పాటికే గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ…ప్రతిపక్షాలు మాత్రం ఇంకా “ఏం చేద్దాం” అనే దగ్గరే ఆగిపోయినట్టు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా తమ ప్రభావం చూపించాలను కుంటున్న పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి సరే…మరి తరవాతి సంగతేంటి..? ఇప్పటికి నాలుగైదు సార్లు సమావేశమయ్యారు. కానీ ఇప్పటి వరకూ కూటమి నుంచి అధికారికంగా “ఇదీ మా ప్రణాళిక” అన్న ప్రకటన రాలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్ప మిగతా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించినట్టే కనిపించడం లేదు. కూటమిలో అంతా బాగానే ఉండుంటే ఈ పాటికి సీట్‌ల షేరింగ్ విషయంలో ఓ స్పష్టత వచ్చుండేది. ఇక్కడే పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. సైద్ధాంతిక విభేదాలున్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు కలవడం అంటే అదో వింతే. అప్పట్లో బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఎన్ని విభేదాలు తలెత్తాయో తెలియంది కాదు. కానీ కూటమి ఈ రెండు పార్టీలనూ ఒక్క చోటకు చేర్చింది. అది ఆ దశకే పరిమితమైంది. సీట్‌ల పంపకాల విషయంలో చిక్కులు వీడడం లేదు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాస్త గట్టిగానే విమర్శలు చేశారు. “ఆమె మోదీకి సేవలు చేయడంలోనే సరిపోతున్నట్టుంది” అంటూ మండి పడ్డారు. అసలే ఉప్పు నిప్పు లాంటి పార్టీలు…చివరకి వరకూ ఎలా కలిసి ఉంటాయన్న అనుమానాలకు ఈ విభేదాలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఇక్కడే మరో విషయమూ చెప్పుకోవాలి. “మాపై మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు” అని మమతా బెనర్జీపై కాంగ్రెస్‌ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి నేరుగానే విమర్శలు చేశారు. అంతే కాదు. సొంతగా పోటీ చేసి కూడా గెలిచి చూపిస్తాం అని తేల్చి చెప్పారు. అంటే…బెంగాల్‌లో సీట్‌ల పంపకాల్లో తేడాలు వస్తున్నట్టేగా. ఇక్కడొక్కచోటే కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లోనూ సీట్‌ల పంపకాల సమస్యని తేల్చడం అంత సులభమేమీ కాదు. మహారాష్ట్ర, బిహార్, యూపీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్‌లో సీట్‌ షేరింగ్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని చూస్తోంది కాంగ్రెస్. అదే సమయంలో స్థానిక పార్టీలకు ఎక్కువ సీట్‌లు ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఈ డబుల్ గేమ్ వల్లే ఈ సమస్య కొలిక్కి రావడం లేదు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కనీస 15-20 సీట్లలో పోటీ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. మహారాష్ట్రలో 48 ఉండగా అందులో 16-20 స్థానాల్లో, పశ్చిమ బెంగాల్‌లో 6-10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇది విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మాత్రమే. ఈ లెక్క పెరగొచ్చు కూడా. కానీ…తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు. ఆ మాత్రం స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టకపోతే అసలు తాము పోటీ చేసి ఏం లాభం అనే వైఖరితో ఉంది కాంగ్రెస్. కానీ 2019 నాటి ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పార్టీలు కాంగ్రెస్‌కి అన్ని సీట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తాయా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. యూపీలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీతో పెద్దగా విభేదాలైతే లేవు. ఒకవేళ అఖిలేష్ యాదవ్ ఒప్పుకుంటే యూపీలో కాంగ్రెస్‌కి పెద్దగా సవాళ్లు ఏమీ ఎదురుకాకపోవచ్చు. సీట్‌ల పంపకాలూ తొందరగానే పూర్తవుతాయి. కాంగ్రెస్‌కి ఉన్న సమస్యల్లా బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోనే. బిహార్‌లో ఆర్జేడీ జేడీయూ లాంటి స్థానిక పార్టీలదే హవా. తమకు బలం ఉన్న నియోజకవర్గాలను వదులుకుని కాంగ్రెస్‌కి ఛాన్స్ ఇస్తాయా అన్నది అంతు తేలని ప్రశ్న. అయినా కాంగ్రెస్‌ కోసం మేమెందుకు త్యాగం చేయాలన్న ఆలోచన వాళ్లలో వచ్చిందంటే హస్తం పార్టీకి చివరకు నాలుగైదు సీట్ల కన్నా ఎక్కువగా మిగలవు. అక్కడే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవచ్చు. అటు మహారాష్ట్రలోనూ ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీకి, కాంగ్రెస్‌కి అసలు పొసగడం లేదు. కచ్చితంగా 20 సీట్లలో అయినా పోటీ చేస్తామని శివసేన మొండి పట్టుపడుతోంది. కాంగ్రెస్‌ కూడా దాదాపుగా అదే కోరుకుంటోంది. కానీ ఎవరి లెక్కలు వాళ్లకుంటాయిగా. పైగా అన్ని స్థానిక పార్టీలూ ఈ లోక్‌సభ ఎన్నికలని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తనకు మాలిన ధర్మం ఎందుకన్న ధోరణిలోనే ఆలోచిస్తున్నాయి. పైగా కాంగ్రెస్‌కి సీట్‌లు ఇవ్వాలంటే గత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం ఎంత ఉందో అన్న లెక్కలు తీస్తున్నాయి. ఈ లెక్కల ఆధారంగా చూస్తే కాంగ్రెస్‌కి తక్కువ సీట్‌లే కేటాయించే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *