సిరా న్యూస్;
-నేడు ఆయన జయంతి
భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త నీలం సంజీవరెడ్డి. ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి. అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913, మే 19 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం అతనికి సమాధి నిర్మించింది.
==================