పాలకులకేమో నూతన సంవత్సర వేడుకలు- మాకేమో ఆకలి కేకలా.

21వ రోజు సమ్మెలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీలు
రాష్ట్ర తెలుగుదేశం మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ

సిరా న్యూస్,బద్వేలు;
అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె 21వ రోజు లో భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని (సిడిపిఓ) కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సిఐటియు) బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలియజేశారు.21 రోజు సమ్మెకు తెలుగుదేశం మహిళ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, మున్సిపాలిటీ నాయకురాలు ఆదిలక్ష్మి,13వ వార్డు టిడిపి కౌన్సిలర్ షేక్ మహమ్మద్ హసన్,34వ వార్డు కౌన్సిలర్, టిడిపి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మిత్తి కాయల సునీత లు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ….
ఇప్పటికే రెండుసార్లు మంత్రులు అంగన్వాడీల సమస్యలపై చర్చించి కూడా ముఖ్యమంత్రితో ఇంతవరకు మాట్లాడలేదంటూ కాలయాపన చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలను ఆందోళన బాట పట్టించింది ప్రభుత్వమే! వారి సమ్మెను అణచి వేసేందుకు అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించింది. గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఆర్పీలు, డ్వాక గ్రూపు మహిళల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను నడిపే దానికి పురమాయించింది. ఆయినా న్యాయమైన అంగన్వాడీ కార్యకర్తల కోర్కెలకు వారందరూ మద్దతు ఇస్తున్నారు. వివిధ తరగతుల ప్రజలు మద్దతు ఫలితంగా ఎమ్మెల్యేలు అంగన్వాడి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేస్తున్నారు. చివరకు ఫుడ్ కమిషన్ చైర్మన్ కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రధాన సెంటర్లుగా మార్చాలని చెప్పవలసి వచ్చింది. అంగన్వాడీ ల సమస్యల పట్ల సర్వత్రా సానుకూలత ఉన్నా ముఖ్యమంత్రి కి సమస్యను పరిష్కరించడం చేతకావడం లేదు.బలవంతంగా నిర్బంధముతో అణిచివేయడానికి పూనుకోవడం శోచనీయం. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు పూనుకోవాలి. అనవసర ఆర్భాట ఖర్చులను, అధిక రేట్లు పెట్టి కొనుగోళ్ళను,ఆప్త మిత్రులకు ఆస్తులు కట్ట పెట్టడాన్ని మానుకుంటే అంగన్వాడీలు అడిగిన వేతనం కంటే అదనంగా వేతనం చెల్లించవచ్చు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని మహిళల ఆగ్రహానికి గురికావద్దని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు పొదిలి కదిరయ్య, ఐద్వా మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు గంప అనంతమ్మ, నాయకురాళ్లు మోక్షమ్మ, బాలమ్మ,నాగమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, నాయకులు రాజగోపాల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎం షరీఫ్,నాయకులు సురేంద్ర, పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *