జలపాతాలకు నో ఎంట్రీ

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల వరదల్లో చిక్కుకుని ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడారు. విహార యాత్రలు విషాదాంతం అవుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు.ములుగు జిల్లాలోని బొగత జలపాతాల వద్ద మంగవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద వరదల్లో చిక్కుకుని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మొత్తం ముగ్గురు వరదల్లో కొట్టుకుపోతుండగా ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. తోటి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ యువకుడు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చేతికందిన కొడుకు జలసమాధి కావడంతో ఆ కుటుంబానికి గర్భశోకం మిగిలింది.జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. మృతి చెందిన యువకుడు వరంగల్‌లోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన జస్వంత్‌గా గుర్తించారు. ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఏడుగురు స్నేహితులు కలిసి సరదాగా బొగత జలపాతాల సందర్శనకు వెళ్లారు. జలపాతాలు వీక్షించిన అనంతరం అక్కడ ఫోటోలు దిగారు. అనంతరం జలపాతాల వరద లోతు గమనించకుండా ముగ్గురు యువకులు స్నానాలు చేయడానికి అందులోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న ముగ్గురిలో జశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందే అంతా చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. వరదల్లో చిక్కుకుని నిండు ప్రాణాలు కోల్పోయాడు.
ముగ్గురు యువకులు వరదల్లో కొట్టుకుపోతుంటే గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. కానీ అప్పటికే జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు. వాటర్ ఫాల్స్ నుండి డెడ్ బాడీ బయటకు తీసి వెంకటాపురం ఏరియా ఆసుపత్రి మార్చురీ కి తరలించారు. అయితే, అయితే జలపాతాలు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వరద ఉధృతి తగ్గేవరకు ఎవరూ రావద్దని ఆంక్షలు విధించారు. ప్రమాదాల నివారణకు నో ఎంట్రీ పెట్టేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *