ఇక తెలుగు నేతలు కనిపించరా….

సిరా న్యూస్;

జాతీయ రాజ‌కీయాలు ఈ మాట అన‌గానే దేశం మొత్తం క‌ళ్ల‌కు క‌డుతుంది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌రకు ఉన్న ఆసేతు హిమాచ‌లం గురించి నాయ‌కులు చ‌ర్చించే అవ‌కాశం జాతీయ రాజీకీయాల్లో స‌స్ప‌ష్టం. ఒక‌ప్పుడు అనేక మంది తెలుగు వారు జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స‌హా.. మ‌ద్రాసు రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయ‌కులు జాతీయ‌స్థాయిలో ఓ వెలుగు వెలిగారు. అయితే.. గ‌డిచిన ప‌దేళ్ల కాలంలో జాతీయ రాజ‌కీయాల్లో వ‌న్నెలీనుతున్న తెలుగు వారి సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో వేళ్ల మీద లెక్కించుకునే స్థాయిలో నాయ‌కుల సంఖ్య ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిప్ర‌స్తావించారు. జాతీయ రాజ‌కీయాల్లో తెలుగు నేత‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ప్ర‌మాదక‌ర సంకేతాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి గ‌డిచిన ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కు కూడా తెలుగు ప్రాంతానికి చెందిన అనేక మంది నాయ‌కులు జాతీయ‌స్థాయిలో కీల‌క పాత్ర పోషించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పీవీ న‌ర‌సింహారావుప్ర‌ధానమంత్రిగా ఈ దేశాన్ని పాలించారు. ఆయ‌న త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఈ స్థాయిలో ప్ర‌ధాని పీఠాన్ని ఎక్క‌గ‌లిగిన నాయ‌కుడు క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కేంద్ర మంత్రులుగా పదుల సంఖ్య‌లో నాయ‌కులు ప‌ని చేశారు. అయితే.. ఇప్ప‌టిలా కాకుండా అప్ప‌ట్లో ప్ర‌త్యేక ప్రాధాన్యత ఉన్న నాయ‌కులుగా జాతీయ పార్టీలు వారిని గౌర‌వించాయి. ఈ క్ర‌మంలోనే మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు సంజీవ‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ప‌ళ్లం రాజు, జేడీ శీలం వంటి నాయ‌కులు గ‌డిచిన 15 ఏళ్ల కాలంలో దేశానికి తెలుగువారిగా సేవ‌లు అందించారు. వీరికి ఏరికోరిప‌దువులు ద‌క్క‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఎన్టీఆర్ హ‌యాంలో నేష‌న‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి తెలుగు వారికి ద‌క్కింది. ఆ త‌ర్వాత‌.. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలోనూ ఎన్డీయే కూట‌మికి సార‌థ్యం వ‌హించే బాధ్య‌త‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, రాష్ట్ర‌ప‌తి ఎంపిక నుంచి కొన్నికొన్ని మౌలిక నిర్ణ‌యాల్లోనూ తెలుగు వారి పాత్ర ఒక‌ప్పుడు ఉండేది. తెలుగు వారికి పదవులు ద‌క్కేందుకు ఏ పార్టీ కూడా.. ప్రాధాన్యం త‌ప్ప‌నిస‌రిగా ఇచ్చిందే కానీ.. ఏదో సంఖ్యా ప‌రమైన మ‌ద్ద‌తు కోసం ఇవ్వాల‌ని ఇవ్వ‌లేదు. అంటే.. వారిలో ఉన్న స‌త్తా, ప్ర‌జాభిమానం, జాతీయ‌స్థాయి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వంటివి ద్విగుణీకృతమ‌య్యాయి. ఇక‌, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. బీజేపీతో పొత్తులో ఉన్న కార‌ణంగా రెండు కేంద్ర మంత్రి ప‌ద‌వులు తెలుగు వారికి అందునా తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు ద‌క్కాయి. అయితే, వీరి ప్ర‌ధాన భూమిక జాతీయ స్థాయిలో ఇనుమ‌డించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర మంత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్ర‌స్థాయిలోనే వారు త‌మ‌ను తాము ప‌రిమితం చేసుకున్నారు. కానీ, ఒక పీవీలాగా, సంజీవ రెడ్డి మాదిరిగా, వెంక‌య్య నాయుడు త‌ర‌హాలో బ‌ల‌మైన ముద్ర‌ను సంత‌రించుకోలేక పోయారు. ఇక‌, ఇప్పుడు క‌నీసం జాతీయ స్థాయిలో రాణించ‌ద‌గ్గ నాయ‌కులు క‌నిపించ‌డ‌మే లేదు. ఒక‌రిద్ద‌రు ఉన్న‌ప్ప‌టికీ.. వారు కూడా.. నామ‌మాత్ర‌పు పాత్ర‌ల‌తో ప‌రిమిత రాజ‌కీయాల‌కే క‌ట్టుబ‌డి పోయారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌కు చెందిన గంగాపురం కిష‌న్‌రెడ్డి ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌యాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు. కానీ, ఆయ‌న ప‌రిధి చాలా స్వ‌ల్పంగా మారిపోయింది. స‌ల‌హాలు ఇచ్చేందుకు, సూచ‌న‌లు చేసేందుకు, విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకునేందుకు అవ‌కాశ‌మే లేకుండా పోవ‌డం ఆలోచించాల్సిన విష‌యం. కేంద్రంలో 2014 నుంచి ఇప్పటి వ‌ర‌కు అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం తెలుగు వారి ప్రాధాన్యాన్ని నానాటికీ తీసిక‌ట్టుగా మార్చేసింది. 2019 వ‌ర‌కు కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య నాయుడును ఉప‌రాష్ట్ర‌ప‌తిని చేసిన ద‌రిమిలా తెలుగు వారి గ‌ళం జాతీయ స్థాయిలో వినిపించ‌డం త‌గ్గిపోయింది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. మ‌రింత‌గా తెలుగు వారి ప్రాభ‌వం త‌గ్గిపోయింద‌నే చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది ఎంపీలు ఉన్నా.. వారిలోనూ ఏ ఒక్క‌రూ బ‌ల‌మైన జాతీయ స్థాయి నాయ‌కుడిగా ఎద‌గ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఉత్త‌రాది రాజ‌కీయాల డామినేష‌నేన‌ని అంటారు ప‌రిశీల‌కులు. జాతీయ స్థాయిలో బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోతే ఏం జ‌రుగుతుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. తెలుగు వారి గ‌ళం బ‌లంగా వినిపించే అవ‌కాశం లేక‌పోవ‌డం ప్ర‌ధాన లోపంగా మారుతుంది. అంతేకాదు..తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కూడా దిక్కులు చూడాల్సిన ప‌రిస్థితి, విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకునే వెసులు బాటు లేక‌పోవ‌డం వంటి కీల‌క‌మైన అంశాల విష‌యాల్లో తెలుగు వారిపాత్ర మ‌రింత త‌గ్గిపోతుంది. నిజానికి ఎంపీలుగా ఉన్న వారికి జాతీయ స్థాయిలో బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డంతోపాటు.. జాతీయ రాజ‌కీయాల‌పై ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ప్రాంతీయ పార్టీల ఆధిప‌త్యాన్ని అడ్డుకునే రీతిలో జాతీయ పార్టీల వ్య‌వ‌హార శైలి ఉండ‌డం దీనికి ప్ర‌ధాన అవ‌రోధంగా మారింది. దీనిని అధిగ‌మించి.. జాతీయ స్థాయిలో నాయ‌కులు వెలుగొందిన‌నాడే.. తెలుగు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేరుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు.. కేంద్రంలోఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన వెంక‌య్య‌నాయుడు ఏపీ స‌హా తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై ఎవ‌రు వెళ్లినా..చెప్పుకొనేందుకు స‌మ‌యం ఇచ్చారు. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌వంతు కృషి చేశారు. ఫ‌లితంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు అంతో ఇంతో మేలు జ‌రిగింది. ఇలాంటి వ్యూహాత్మ‌క‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఎంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *