ఒప్పందాలపై బహిరంగ ప్రకటన
సిరా న్యూస్,ఖమ్మం;
బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, చత్తీస్గడ్ నుంచి విద్యుత్ ఒప్పందాలపై దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నెలలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా, విచారణలో భాగంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, చత్తీస్గడ్ విద్యుత్ ఒప్పందాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే పది రోజుల్లో అందించాలని ప్రకటనలో పేర్కొన్నారు.మణుగూరు సమీపంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించడానికి అత్యంత ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీని వినియోగించారని, రెండేళ్ల కాలం వ్యవధి సరిపోతుండగా.. దాన్ని అధిక మూల వ్యయంతో ఎక్కువ కాలం అంటే 7 సవత్సరాల కాలం తీసుకోవడానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని కమిషన్ పేర్కొంది. బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ కాకుండా పూర్తిగా నామినేషన్ ప్రాతిపదికన ఈపీసీకి కాంట్రాక్ట్ అందించడంపైనా ఆరోపణలను ప్రస్తావించింది. అలాగే, డిస్కమ్స్ నుంచి ఎక్కువ వ్యయానికి కారణమవుతూ 179 నుంచి 388 కిలోమీటర్ల దూరంలోగల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు సరఫరాతో దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ఎందుకు స్థాపించారని, ఇందులోనూ బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ కాకుండా ఎందుకు నామినేషన్ ప్రాతిపదికను సదరు యూనిట్ స్థాపనకు ఈపీసీకి కాంట్రాక్ట్ అందించారని పేర్కొందివీటితోపాటు చత్తీస్గడ్ రాష్ట్ర డిస్కమ్స్ నుంచి విద్యుత్ సేకరణకు బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ అనుసరించలేదని కమిషన్ పేర్కొంది. కాంట్రాక్ట్ చేసుకున్న కెపాసిటీకి చాలా తక్కువ విద్యుత్ షెడ్యూలింగ్ అయినప్పటికీ పూర్తి కాంట్రాక్ట్ కెపాసిటీ అంటే 1000 మెగావాట్ల కొరకు కారిడార్కు సంబంధించి పీజీసీఐఎల్కు పూర్తి చెల్లింపులు జరిపారని వివరించింది. వీటిపైనా దర్యాప్తు చేపడుతున్నట్టు కమిషన్ పేర్కొంది. వీటికి సంబంధించి వివరాలు తెలిసినా లేదా అవగాహన ఉన్న వ్యక్తులు, సంస్థలు, నిపుణులు పది రోజుల్లొగా coi2024.power@gmail.comకు ఈమెయిల్ లేదా బీఆర్కే భవన్లో 7వ అంతస్తులోని కమిషన్ కార్యాలయానికి వచ్చి లేదా తపాలా ద్వారా బట్వాడా కూడా చేయవచ్చునని వివరించింది.మౌఖిక సాక్ష్యాలు ఇవ్వాలనుకుంటే తమకు ఆ విషయాన్ని తెలియజేస్తే అభ్యర్థనను కమిషన్ పరిశీలించి నిర్ణయాన్ని కమిషన్ తెలియజేస్తుందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆ ప్రకటనలో వెల్లడించారు
================xx