నెంబర్ 2 చంద్రబాబేనా…

సిరా న్యూస్;
“చదరంగం ఆటలో ఒంటెల్ని, గుర్రాల్ని, మంత్రులను దాటి రాజును వేసేస్తే ఆట ముగుస్తుంది. పావులు మళ్ళీ జోడిస్తే కొత్త ఆట మొదలవుతుంది. ఇక్కడ కిరీటాలు మాత్రమే శాశ్వతం. తలలు కాదు”.. చదరంగానికే కాదు ప్రస్తుత వర్తమాన రాజకీయాలకు కూడా పై మాటలు నూటికి నూరు పాళ్లు వర్తిస్తాయి. ఎందుకంటే రాజకీయాలలో పదవులు శాశ్వతంగా ఉంటాయి. కాకపోతే వాటిని అలంకరించే వ్యక్తులు మారిపోతుంటారు. 2014 నుంచి 2020 నాలుగు దాకా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాన్ని అమిత్ షా అలంకరించారు. అటు పార్టీలో, ఇటు కేంద్రంలో రెండవ స్థానంలో ఏకచత్రాధిపత్యంగా కొనసాగారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపి అనుకున్న విధంగా 400కు మించి సీట్లు రాలేదు. ఎప్పటికీ అండగా ఉంటున్న ఉత్తర ప్రదేశ్ అక్కున చేర్చుకోలేదు. మహారాష్ట్ర ధైర్యాన్ని ఇవ్వలేదు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక మాత్రమే ఆలంబన ఇచ్చాయి. ఫలితంగా మోదీ ఊహించని ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 272+ సీట్లు సాధించిన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బిజెపికి 16 స్థానాలు సాధించిన చంద్రబాబు, బీహార్ లోని నితీష్ కుమార్ సహకారం కావాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.ఇటీవల ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సింహభాగం దక్కింది. గత పది ఏళ్లల్లో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదు. అటు బీహార్ పరిస్థితి కూడా అంతే. దీంతో దేశ వ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలపై చర్చ జరుగుతోంది.. ఇదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. మునుపటి ఉత్సాహం ఆయనలో కనిపించడం లేదు. బహుశా మోదీ అనుకున్న సీట్లు రాకపోవడమే ఇందుకు కారణమని వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇదే దశలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. తన రాష్ట్రానికి కావలసిన పనులను మొత్తం ఆయన చక్క పెట్టుకుంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే సంస్కరణలు చేయాలని.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని తర్వాత అటు జాతీయ మీడియాలో చంద్రబాబు బాగా ఫోకస్ అయ్యారు.. ఆ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు..చంద్రబాబు అప్పట్లో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. 2019 ఎన్నికలకు ముందు బిజెపికి దూరమయ్యారు. రాజకీయంగా నష్టపోయారు. వైసీపీకి చేజేతులా ఛాన్స్ ఇచ్చారు. బిజెపిని వదులుకొని మూల్యం చెల్లించుకున్నారు. అదే బిజెపి కోసం ఐదేళ్లుగా ఎదురు చూశారు. ఎన్నికలకు ముందు వారితో స్నేహాన్ని కుదుర్చుకున్నారు. మళ్లీ విజయాన్ని అందుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా మరోసారి బిజెపితో స్నేహం చెడిపోకుండా ఉండేందుకు చంద్రబాబు తాను తగ్గి.. తనను తాను తగ్గించుకుని ఉంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీపై చంద్రబాబు వీర విధేయత ప్రదర్శిస్తున్నారు. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉన్నా.. ఆ పార్టీకి కేవలం రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. నేరుగా రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు మోడీ సర్కార్ ముందుకు రాకున్నా.. ప్రధాని మోదీ పై మాత్రం విధేయతను కొనసాగిస్తున్నారు చంద్రబాబు. గతంలో మాదిరిగా తప్పటడుగులు వేస్తే ఎంత నష్టపోతామో చంద్రబాబుకు తెలియదు కాదు. అందుకే ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన క్రమంలో.. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ తో పాటు బిజెపి అగ్రనేతల సాయంతో ఏపీని.. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆహ్వానాలు అందాయి. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. బిజెపికి వ్యతిరేకంగా ముద్రపడిన ముఖ్యమంత్రులు సైతం రాలేదు. చివరకు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం పాల్గొనలేదు. రాష్ట్రం తరఫున ప్రతినిధులను మాత్రమే పంపించారు. కానీ చంద్రబాబు మాత్రం స్వయంగా హాజరు కావడం విశేషం.చంద్రబాబు హాజరు వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఈ ఐదేళ్లపాటు చంద్రబాబుకు కీలకం. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు వంటి విషయంలో చొరవ చూపకపోతే.. రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం చవిచూడడం ఖాయం. అందుకే కేంద్రం నుంచి పిలుపు వచ్చిన ఏ కార్యక్రమానికైనా తానే హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఏపీకి సంబంధించి కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందు ఉంచారు.దేశ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా కనిపించారు. ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకోవడంతో.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ కూటమి నుంచి బయటికి వచ్చారు. మళ్లీ 2014లో ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆ తర్వాత నరేంద్ర మోడీకి ఆయనకు విభేదాలు వచ్చాయి. అనంతరం ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటికి వచ్చారు. మళ్లీ 2023 చివర్లో బిజెపి పెద్దలతో మంతనాలు జరిపి ఎన్డీఏ కూటమిలో చేరారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. ఏకంగా 16 పార్లమెంటు స్థానాలను దక్కించుకొని ఎన్ డి ఏ కూటమికి మద్దతు పలికారు. చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్ల బిజెపి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది..సంకీర్ణ ప్రభుత్వాలలో ముఖ్యపాత్ర పోషించడం చంద్రబాబుకు ఇది కొత్త కాకపోయినప్పటికీ.. ఈసారి మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో నెంబర్ -2 స్థానంలో చంద్రబాబు కొనసాగుతున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రముఖ జాతీయ వార్తా విశ్లేషకుడు, “ఇండియా టుడే” సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా పై వ్యాఖ్యలే చేశారు..”చంద్రబాబు ఢిల్లీలో గత కొంతకాలంగా చురుకుగా కనిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లోనూ తన మార్క్ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవల బడ్జెట్లో తన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిపించుకున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ తో మరింత సన్నిహితమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో వారిద్దరిని చూస్తే అదే అనిపించింది. దీని ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నంబర్ -2 అనడంలో ఎటువంటి సందేహం లేదని” రాజ్ దీప్ వ్యాఖ్యానించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *