అధికారులు చెరువుల పూర్తి సమాచారం ఇవ్వాలి

సిరా న్యూస్,హైదరాబాద్;
హైడ్రా విషయంలో ప్రజలు తిరగబడితే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రా న్యాయస్థానాల నిర్ణయాలను చట్టాలను సైతం గౌరవించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు . కూకట్పల్లి నియోజకవర్గం లో హైడ్రా పేద ప్రజల జోలికి వస్తే సహించేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని బోయిన్ చెరువు ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరిజన బస్తికి చెందిన పేద ప్రజలు తమ నివాసాలను కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని చెరువుల పూర్తి సమగ్ర సమాచారాన్ని తనకు అధికారులు అందజేయాలని ఆదేశించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రాజకీయ నాయకుల పై ఘాటైన విమర్శలు చేశారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భయపడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *