సిరా న్యూస్,హైదరాబాద్;
రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు అవుతున్న ఎమ్మెల్యేలపై రాజకీయవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై సొంత పార్టీలోనూ పుకార్లు ప్రారంభమయ్యాయి. దీనిపై రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. వారెవరూ పార్టీ మారే ఉద్దేశంతో తన వద్దకు రావడం లేదని.. తాను కూడా వారిని అందు కోసం కలవలేదని చెబుతున్నారు. వారిపై బీఆర్ఎస్ అనుమానాలు పెంచుకుంటే తనకేం సంబంధం లేదన్నారు. చివరికి జగ్గారెడ్డి తమతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్న మాటల్ని కూడా లైట్ తీసుకున్నారు. వారెవరో జగ్గారెడ్డి పార్టీ దృష్టికి తీసుకొస్తే పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమిటన్నది రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. నిజానికి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆసక్తితో రేవంత్ రెడ్డి లేరు. గతంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే విషయాన్ని చెబుతున్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ బలహీనపడదన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. అందుకే తాను ఆ పార్టీ ఎమ్మెల్యేల జోలికి వెళ్లబోనన్నారు. అలాగని తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలను చూస్తూ ఉరుకుంటారా అంటే… అక్కడ కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ జోలికి వస్తే కల్ట్ చూపిస్తామని కూడా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఆయన ముఖ్య విధి. దానికి తగ్గ ఏర్పాట్లు ఆయన చేసుకునే ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇన్స్టంట్గా సీఎం పదవిలోకి రాలేదు. కింది నుంచే వచ్చారు. పైగా ఆయన గత పదేళ్లుగా ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత రాజకీయ కుట్రలను కూడా ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఏమరుపాటుగా ఉండకపోవచ్చు. రేవంత్ ఇప్పటికై ఎమ్మెల్యేలను ఆకర్షించాలని అనుకోవడం లేదని..కానీ తమకు అలాంటి పరిస్థితి కలిపిస్తే మాత్రం ఏం జరుగుతుందో ఆయన శాంపిల్ చూపిస్తున్నారు. మర్యాదపూర్వక భేటీల ద్వారా బీఆర్ఎస్కు సంకేతాలు పంపుతున్నారు. ఎమ్మెల్యేల్ని ఎలా లొంగ తీసుకోవచ్చో కేసీఆర్ గతంలోనే చూపించారు. తాడి దన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడుంటాడని సామెత. అది ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాల్లోనూ అంతే. కేసీఆర్ ఓ బెంచ్ మార్క్ సృష్టించి ఉండవచ్చు కానీ అంతకు మించి రాజకీయాలు చేసేవాళ్లు రారానుకోకూడదు. రేవంత్ రెడ్డి అలాంటి రాజకీయం చేస్తున్నాడని అనుకోవచ్చు. తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని తెలిసిన మరుక్షణం ఆయన పంజా విసిరే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలే కాదు.. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ తరపున గెలిచిన వారికి సంబంధించిన ఆయువు పట్టును రేవంత్ రెడ్డి వర్గం రెడీ చేసుకుంది. బయటకు జరుగుతున్న విచారణలు కొన్ని అయితే అంతర్గతంగా జరుగుతున్నవి ఎన్నో. చాలా మంది ఎమ్మెల్యేలకు వారు పదవుల్లో ఉన్నప్పుడు పాల్పడిన అవకతవకలు.. ఆస్తులకు సంబంధించిన నోటీసులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అందుకే చాలా మంది తాము సీఎంతో భేటీ అవుతామని.. అందులో తప్పేముందని దబాయిస్తున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే .. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.. వీళ్లు బయటపడ్డారు..కానీ లెక్కలేస్తే.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. కాంగ్రెస్ లో చేరిపోతారు. కానీ రేవంత్ రెడ్డి.. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తన ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కేటీఆర్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసిన మరుక్షణం ఆయన పంజా విసిరే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నంత వరకూ బీఆర్ఎస్కు తిరుగు ఉండదని ఆ పార్టీ నేతలనుకున్నారు. కేసీఆర్ ఉన్నంత వరకూ ఆయనే సీఎం అని ధీమాగా ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీ అదే. ఎవరికీ పదవులు శాశ్వతం కాదు. కానీ తమ పదవుల్ని శాశ్వతం చేసుకునేందుకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాలే వారికి తర్వాత పెను గండంగా మారుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూ అదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందునే సగానికైపైగా మున్సిపాల్టీల్లో అధికారం చేతులు మారుతోంది. అంటే క్యాడర్ అంతా వెళ్లిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫిలితాలు తేడా వస్తే పరిస్థితి అంచనా వేయడం కష్టం. బీఆర్ఎస్ బలహీనపడిందని తెలిసిన తర్వాత ఆ పార్టీ ఉనికి దెబ్బతీయడానికి బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు అత్యంత కీలకంగా మారాయి