సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ తొలుత భావించింది. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర వివరాల మేరకు కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.గ్రూప్-2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది. అయితే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.