చట్టాలు మారితేనే… న్యాయం

సిరా న్యూస్;
గతంలో నిర్భయ హత్యాచారం కేసు, మొన్నటికి మొన్న నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు నుండి ఇపుడు హాస్పిటల్లో ఏకంగా ఒక ట్రెయినీ డాక్టర్‌పై ఘోర హత్యాచారం.. వరుసగా ఈ దారుణ ఘటనలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తోంది. 2012 నుంచి అత్యాచారం కేసులు పెరుగుతున్నాయే గానీ, వాటి సంఖ్య తగ్గడంలేదు. ఈ అత్యాచారాలకు ముగింపు ఎప్పుడో .. ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ర్యాలీలు తీయడం, కొవ్వొత్తులు వెలిగించడం. అవి అరిపోయాక ఆ సంఘటన మరిచిపోవడం అలవాటు అయిపొయింది అందరికీ. కానీ రేపటి రోజు ఆ చిన్నారి స్థానంలో గానీ, నిర్భయ స్థానంలో గానీ మన పిల్లల్ని చూసే పరిస్థితి రాకూడదంటే సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకు రావాలి అని ఆలోచించే సమయం ఇది.!అసలు లైంగికదాడి, హత్యాచారం వంటి దారుణ ఘటనలు జరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుని వాటికి పరిష్కారం తెలుసుకుంటే సమాజంలో మార్పులు చూడవచ్చు. ఈ మధ్య కాలంలో టీవీల్లో, సినిమాల్లో ప్రకటనల్లో ఎక్కడ చూసినా, విన్నా ఒక మాటే చెపుతున్నారు. అమ్మాయిలకి ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పేకన్న మీ అబ్బాయిలకు చదువుతో పాటు సంస్కారం నేర్పండి అంటున్నారు. దాంతోపాటు మహిళలపై, చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు, విద్య విధానంలో మార్పు తేవాలి. కుటుంబ విలువలు నేర్పాలి. మన దేశంలో పేదరికం, అక్షరాస్యత పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. చదువుకున్న వాడికైతే సంస్కారం నేర్పగలము కానీ చదువుకున్నుప్పటికీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్న వాడికి, నాగరికత, సమాజం పట్ల బాధ్యత, భయం లేని వారికి ఎవరు నేర్పుతారు?సమాజాన్ని బాగుపరచటంలో మీ వంతు సహాయం లేకపోయినా పర్వాలేదు కానీ సమాజంలో జరుగుతున్న సంఘటనలకు మీరు కారణం కాకూడదు. మన సమాజంలో చిన్నతనం నుంచి రకరకాల కారణంగా కుటుంబ విలువలు, మాట్లాడే పద్ధతి తెలియకుండా, మంచీ చెడూ తెలియకుండా పెరిగిన ఎంతో మంది ఈ సమాజంలో మన మధ్యలో తిరుగుతున్నారు. చదువుకున్నా కూడా చిన్నప్పటి నుంచి వాళ్లకు జరిగిన చేదు అనుభవాల వల్ల కొందరిలో మానసికోన్మాదపు వ్యక్తిత్వం వస్తుంది. అలాంటి వాళ్లకు చదువుతో పని లేదు. అమ్మాయిలు ఎదుటి వారిలో కోరికలను ప్రేరేపించే దుస్తులు వేసుకుంటేనే అత్యాచారాలు జరుగుతాయని గ్యారంటీ ఎక్కడుంది? కోల్‌కతా మెడికల్ కాలేజీలో ఆ ట్రెయినీ డాక్టర్ ఎలాంటి రెచ్చగొట్టే దుస్తులు వేసుకుందని ముష్కరులు అంత దారుణ కృత్యానికి ఒడిగట్టారు మూడేళ్ల పసిపాపలు, 70 ఏళ్ల ముదుసలులు ఎవరిని రెచ్చగొడుతున్నారని వారిమీద పడుతున్నట్లో మరి.ప్రస్తుతం వున్న విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మనోవిజ్ఞానం అనే అంశాన్ని ఒక సబ్జెక్టు‌గా గుర్తించాలి. చిన్నప్పటి నుండే ప్రతీ స్టూడెంట్ మానసిక పరిస్థితిని గుర్తించడం, వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి. ఒక హత్య కానీ, లైంగిక దాడి కానీ చేసిన వ్యక్తిని మెంటల్ హాస్పిటల్‌లో వుంచి కేస్ స్టడీ చేసి, తన మానసిక పరిస్థితికి కారణాలు కనుక్కుని ఆపై అతగాడికి జాప్యం లేకుండా కఠిన శిక్ష విధించాలి. అయితే కఠిన చట్టాలు విధించినంత మాత్రాన తప్పు చేయరనీ, లైంగిక దాడులు ఆగిపోతాయని అనుకోలేం. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు తీరును సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. మెడికల్ ప్రిన్సిల్‌ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసినా.. ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది.ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమాలు ఉన్నా.. అతడిని వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారని సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైంది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.ఇక పలు మీడియా సంస్థల తీరుపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫొటో, పేరును ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నించింది. అలాగే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపలపై కూడా ధర్మాసం పలు కీలక ప్రశ్నలను సంధించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది యంగ్‌ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని కోర్టు వెల్లడించింది. ఇందుకోసం వెంటే ఓ జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని ధర్మాసనం తెలిపింది. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ల విధుల బహిష్కరణతో చాలా మంది రోగులు ఇబ్బందిపడుతున్నారని, తక్షణమే తమ నిరసనలు విరమించాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. అనంతరం ఈ విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.దుబాయ్, అమెరికా లాంటి దేశాల్లో తప్పు చేయటానికి భయపడతారు కాబట్టి అక్కడ నేరాలు ఏవీ జరగవని చెప్పగలమా?మన దేశంలో మార్పు రావాలి అంటే చట్టాలు మారాలి, విద్యా వ్యవస్థ మారాలి. అందరికీ ఉచిత విద్య, అందరికీ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తే ఆరోగ్యమైన మనోవికాసంతో మన దేశం గర్వపడేలా ఒలింపిక్స్ లో గెలవగలుగుతారు. లేదా తప్పు దారుల్లో వెళ్లి ఇలాంటి హత్యాచారాలు చేస్తూనే వుంటారు. ఇలాంటి కేసు స్టడీలని మనోవిజ్ఞాన సబ్జెక్టులో చేర్చి ఒక ఉదాహరణగా చూపించాలి. ఎన్ని గవర్నమెంటు‌లు మారినా ఇలాంటి మార్పులు చేయకపోతే, ఆ నేతలు సిగ్గుపడాల్సి ఉంది. ఇదంతా జరిగే వరకు అమ్మాయిలు కాస్త జాగ్రత్త. నలుగురితో కలిసి నడుద్దాం, ఒంటరి ప్రయాణాలు, ఒంటరిగా స్నికౌట్‌‌లు (లాంగ్ డ్రైవ్, నైట్ డ్రైవ్) చేసి తల్లితండ్రులకు కడుపు కోత మిగల్చకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *