పాలమూరు జిలానీల్లో ఆవేదన…ఆనందం

సిరా న్యూస్,మహబూబ్ నగర్;
ఎన్నికల ముందు నాటి అధికార బీఆర్ఎస్ లో చేరిన నేతలు నేడు ఆందోళనలో మునిగిపోయారు. అభ్యర్థుల ప్రకటన, ఇతర అవకాశాల కోసం కాంగ్రెస్, బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరితే ఎన్నికల తీర్పు అవాక్క్ అయ్యేలా చేసింది. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అధికార పార్టీలోకి వెళ్లి తాజాగా మళ్లీ ప్రతిపక్షంలో పడిపోయారు. నాడు అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షంలోకి వెళ్లి మళ్లీ అధికారంలోకి వెళ్లారుఎన్నికల పండుగ ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఎన్నికల ముందు నేతలు తీసుకున్న నిర్ణయాలు కొంతమందిని ముందుకు నడిపిస్తే మరికొంత మందిని అగాథంలో పడేసాయి. టికెట్ దక్కలేదని కొందరు, రాజకీయ అవకాశాల కోసం మరికొందరు వివిధ పార్టీలను వదిలి బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను కాదనీ కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో పార్టీ మారిన నేతలు ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ముఖ్యనేతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికల వరకు కాంగ్రెస్ లో పనిచేసి.. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తుందనుకున్న బీఆర్ఎస్ లో చేరితే పరిస్థితి తారుమారయ్యిందని ఆయోమయోంలో పడ్డారు. నాడు పదేళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితమయి. ఇప్పుడు కూడా మళ్లీ ప్రతిపక్షంలో చేరామన్న ఫీలింగ్ లో ఉన్నారట నేతలు.అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని పార్టీల్లోకి నేతల వలసలు కొనసాగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి పలువురు కీలక నేతలు జంప్ అయ్యారు. రాజకీయ కురువృద్ధుడు నాగం జనార్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీడీపీ సినీయర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మరికొంతమంది ఓ స్థాయి పట్టున్న నేతలు కారెక్కారు. కాంగ్రెస్ లో అసంతృప్తిని అసరా చేసుకొని వీరందరిని గులాబీ పార్టీ చేర్చుకుంది. ఎంతో కొంత ఓటు బ్యాంకు అభ్యర్థులకు కలసివస్తుందని భావించి.. అధికారంలోకి వచ్చాక తగిన అవకాశాలు కల్పిస్తామని హామి సైతం ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. కుమారుడి రాజకీయ భవిష్యత్, కాంగ్రెస్ లో చేరిన కూచుకుళ్ల కుటుంబంపై కోపంతో నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.అధికారంలోకి వస్తే కుమారుడు రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసే అవకాశం వస్తుందని భావించారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్చర్ల, నారాయణ పేటలో ఎదో ఒక టికెట్ వస్తుందని అశించి భంగపడ్డారు. దీంతో ఆయన అసంతృప్తిని బీఆర్ఎస్ అక్కున చేర్చుకొని పార్టీలో చేర్చుకుంది. మరోవైపు బీజేపీలో కొనసాగుతున్న మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ సైతం కమలం వీడి గులాబీలో చేరాడు. వీరితో పాటు పలువురు మైనారిటీ నేతలు సైతం మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందన్న భావనతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14సీట్లకు గాను 12సీట్లను కైవసం చేసుకొని తుఫాన్ సృష్టించింది. అయితే ఈ తుఫాన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులే కాదు ఎన్నికల ముందు కొండంత ఆశతో పార్టీ మారిన నేతలు సైతం గల్లంతయ్యారు. నాడు ప్రతిపక్షంలోనే ఉండి.. నేడు ప్రతిపక్షానికే పరిమతమయ్యామనే బాధలో ఉన్నారట. ఇప్పటికిప్పుడు భవిష్యత్ పై ఎలాంటి ఆలోచన చేయని నేతలు పార్టీ ఓటమిపైనే మదనపడుతున్నారట. కొంతమంది నేతలు అయితే పార్టీ మారడం తప్పుడు నిర్ణయమేమో అన్న అభిప్రాయాన్ని అనుచరుల వద్ద ప్రస్తావించారట.బీఆర్ఎస్ లో చేరిన వారి పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ లో చేరిన వారికి మాత్రం అదృష్టం వరించిందనే చెప్పుకోవచ్చు. ఎన్నికలకు అటు ఇటుగా పార్టీ మారీ కాంగ్రెస్ టికెట్ సంపాదించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, తుడి మోఘారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల్లో విజయం సాధించి సంతోషంలో ఉన్నారు. టికెట్ అశించి భంగపడిన మరికొంత మంది నేతలు బుజ్జగింపులకు తలోగ్గి పార్టీ విజయం కోసం పనిచేశారు. అలాంటివారికి నామినేటెడ్ అవకాశాలు కల్పిస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో వారు సైతం ఎదో ఒక అవకాశం వస్తుందనే ఆనందంలో ఉన్నారు. ఏది ఏమైనా పాలమూరు పాలిటిక్స్ చూస్తుంటే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయని మరోసారి రుజువు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *