సిరా న్యూస్,మహబూబ్ నగర్;
రాష్ట్రంలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో అట్టుడుకుతున్నాయి. ప్రతిరోజూ ఏదోఒక చోట అవిశ్వాస తీర్మాణాలపై ఓటింగ్ జరుగుతోంది. గత పాలకుల నేతృత్వంలో కొనసాగుతున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్లను గద్దే దింపి కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తోంది. తాజాగా మూడు మున్సిపాల్టీలో అవిశ్వాస పరీక్ష జరిగింది. రెండు మున్సిపాల్టీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. సూర్యాపేటలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది.ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం నెగ్గింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లను, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లను కలుపుకుని, కాంగ్రెస్ అవిశ్వాస ప్రక్రియలో విజయం సాధించింది. మొత్తం 49 మంది కౌన్సిలర్లలో మెజారిటీ స్థానాలను దక్కించుకుని గత నాలుగేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని ఏలుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పురపాలికలో పరిణామాలు వేగంగా మారాయి.గత కొంతకాలంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల తీరుపై అసంత్రుప్తిగా ఉన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్, మిగిలిన పార్టీలతో కలసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో జనవరి 27న కలెక్టర్ అధ్యక్షతన మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై అవిశ్వాసంపై చర్చించింది. సమావేశానికి ముందే 33మంది హాజరును కోరంగా అధికారులు నిర్ణయించారు. అయితే రహస్య ప్రదేశంలోని క్యాంపు నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన రెబల్స్ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో వచ్చి నేరుగా సమావేశానికి హాజరయ్యారు. ఇక, అవిశ్వాస సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 23మంది రెబల్స్, కాంగ్రెస్ కు చెందిన 5, ఎంఐఎం 4, బీజేపీ ముగ్గురు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అటెండ్ అయ్యారు.మొదట ఛైర్మన్, తరువాత వైస్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మాణాలపై చర్చించి, ఓటింగ్ నిర్వహించారు. సమావేశానికి హాజరైన 35 మంది కౌన్సిలర్లు తీర్మాణానికి మద్దుతుగా నిలిచారు. అవిశ్వాస సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గైర్హజరయ్యారు. హాజరైన కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో గడిచిన నాలుగేల్లుగా ఛైర్మన్ గా కొనసాగుతున్న కేసీ నర్సింలు, వైస్ ఛైర్మన్ గణేశ్ తమ పదవులు కోల్పోయారు. ఇక త్వరలోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహణకు ప్రకటన జారీ చేయనున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇక అవిశ్వాసానికి మద్దతు తెలిపిన బీజేపీకి వైస్ ఛైర్మన్ పదవీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.