Panchayat Election: ఇక స్థానిక స‌మ‌రం..

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
ఇక స్థానిక స‌మ‌రం..
* ప‌ల్లెల్లో మొద‌లైన సందడి
* ఊపు మీదున్న రాజ‌కీయ‌కులు
* పల్లెల్లో మారుతున్న సమీకరణాలు

పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇక అందరూ చూపు పంచాయతీ ఎన్నికలపై పడింది. గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు 1 ఫిబ్రవరి 2024న ముగిసింది.. ఆ మరునాడు ( ఫిబ్రవరి 2)వ తేదీన గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది.రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన క్యాడర్లకు పదవులు లభించేలా గడువు ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైనప్పటికీ ఈ లోగా ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికలు తీసుకురావడంతో తెరపైకి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది.గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల విధులు కేవలం రికార్డులపై సంతకాల కోసమేనని, జనంలో విమర్శలు తెరకెక్కయి దీనితో గ్రామీణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ ఎలక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. గ్రామపంచాయతీలకు కొత్త పాలకవర్గం వస్తే తప్ప తమకు సంపూర్ణ న్యాయం జరగదని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పల్లె ప్రజలు నిరీక్షిస్తున్నారు.
మారుతున్న రాజకీయ సమీకరణాలు..
గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం జులై లేదా ఆగస్టు మాసంలో పెట్టవచ్చనే అంచనాలతో పల్లెల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గాలి వీస్తుందని, అందుకే ఆ పార్టీ నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు సునాయసమవుతుందని, టిఆర్ఎస్ నాయకులతో సహా తాజా మాజీ ప్రజాప్రతినిధులు ముందుచూపుతో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. నిన్న మొన్నటి వరకు వివిధ పార్టీల నుండి రాజకీయ విరోధులుగా ఉన్న వారంతా, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఒకే పార్టీ మిత్రులుగా మారుతున్నారు. అయితే మనుషులు కలిసినంత ఈజీగా మనసులు కలవడం లేదు. ఎన్నికల ముందు పార్టీని తిట్టిపోసిన వారు ఇప్పుడు అదే పార్టీలో చేరడంతో సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో పాత కొత్త నడుమ కాంగ్రెస్లో ‘ స్థానిక ‘ టికెట్ల పంచాయతీ తప్పేలా లేదు బెల్లం దగ్గరికి ఈగలు చేరినట్టు అధికారాలు అనుభవించడం కోసం బిఆర్ఎస్ సహా ఇతర పార్టీల నుంచి గుంపులు గుంపులుగా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు.. ఈ వలస పక్షులు ఐదేళ్లు అధికారం అనుభవించి మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి, బిఆర్ఎస్ లేదా బిజెపి గూటికి చేరిన ఆశ్చర్యం పోవాల్సింది లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *