సిరా న్యూస్,హైదరాబాద్;
అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసి కొన్ని రోజులైనా గడవకముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలవబోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అతిత్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంభించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2024 జనవరి 31తో ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుంది. క్రితం సారి 2019లో జనవరి ఒకటో తేదీనే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లపై కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించారు. మరో వారం పదిరోజుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చాలని భావిస్తే తప్ప, గతంలోని పంచాయతీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశముందని పరిశీలకులు చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి కేవలం రెండు రోజులే అయింది. ఈ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లు మార్చాల్సిన అవసరం ఉండదు. అలా కుదరని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు మారుస్తుంది. ఎన్నికల సమయానికి రిజర్వేషన్లు సహా ఎన్నికల తేదీలనూ ప్రకటించాల్సి ఉండగా అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదుఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల కోసం 2023 అక్టోబర్ 1 వరకు 18 ఏళ్లు పూర్తయిన వారికి ఓటుహక్కు కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024, జనవరి 1వ తేదీ వరకు అవకాశం కల్పించే చాన్స్ ఉంది. దీంతో పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాలన చక్కదిద్దే పనిలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్లు, ఓటర్ల నమోదుపై దృష్టి సారించకపోవచ్చని తెలుస్తోంది.