సిరిసిల్లలో కూతురిని చంపేసిన పేరంట్స్

సిరా న్యూస్,కరీంనగర్;
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చెప్యాల ఎల్లవ్వ, నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక (27) ఉంది. ఆమెకు గత ఏడేండ్లుగా మానసిక సమస్యతో బాధపడుతుండటంతో.. తల్లిదండ్రులు లక్షల రూపాయలు దారపోసి ప్రియాంకకు చికిత్స చేయించారు. ప్రియాంకకు నయంకావాలని ఎన్నో ఆలయాలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వ్యాధి నయం కావడంతో సంబరపడిపోయారు. కూతురుని ఓ అయ్య చేతిలో పెడితే తమ బాధ్యత తీరుతుందని భావించారు. అలా ఓ చక్కని సంబంధం చూసి 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కరీంనగర్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు 13 నెలల బాబు ఉన్నాడు. ఇంతలో నెల క్రితం ప్రియాంకకు వ్యాధి తిరగబెట్టింది. భర్తతోపాటు 13 నెలల పసివాడిని కొట్టడం, చుట్టుపక్కల వారిని దూషించడం చేయసాగింది. దీంతో ఆమె భర్త.. ప్రియాంక వింత ప్రవర్తన గురించి ఆమె తల్లిదండ్రులకు తెలిపాడు. వారు కరీంనగర్‌కు వచ్చికూతురిని ఇంటికి తీసుకెళ్లారు.అనంతరం ప్రియాంకను స్థానికంగా ఉన్న బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడే 3 రోజులు ఉంచినా ఏ మాత్రం మార్పురాలేదు. దీంతో విసిగిపోయిన వారు ఈ నెల14న రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కూతురిని నూలు దారంతో ఉరేసి చంపేశారు. అనంతరం ప్రియాంక మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె భర్త.. మృతదేహాన్ని నంగునూరుకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేశారు. అయితే స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ప్రియాంక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ప్రియాంక తల్లిదండ్రులు నర్సయ్య, ఎల్లవ్వలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన నూలు దారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.
==========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *