సిరా న్యూస్,అనంతపురం;
ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ప్రియ శిష్యులు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే రాజకీయంగా బద్ధ శత్రువులయ్యారు. నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీలో ఎమ్మెల్యేలుగా వారి ఆధిపత్యం కొనసాగించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తరఫున కొత్త ఇంఛార్జీలు వచ్చారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల దుస్థితి దయనీయంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెందిన ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇన్నేళ్లుగా చేస్తున్న మైనింగ్పై దాడులకు దిగారు వాణిజ్య పనుల శాఖ, మైన్స్ అధికారులు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న క్వారీల్లో తనిఖీలు చేపట్టారు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. జీఎస్టీ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అన్నింటినీ ఆపేయాలంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గురువారం సాయంత్రం నుంచి క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికార పార్టీలో ఇన్నేళ్లుగా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి చేస్తున్న అక్రమాలపై టీడీపీ ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు రంగంలోకి దిగారు. తమను కాదని తమకు బైబై చెప్తున్నా వైసీపీని వీడి వెళ్తున్న నేతలపై అధికారపార్టీ పెద్దలు గరంగరం అవుతున్నారు.కదిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న అధికార పార్టీలోని ముఖ్య నేతలనే ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారి వ్యాపార కార్యకలాపాలపై వివిధ శాఖల అధికారులు దాడులు చేస్తున్నారని అంటున్నారు. కదిరి, రాయదుర్గం ఎమ్మెల్యేల వెంట వెళ్తున్న వైసీపీలోనే అసమ్మతి నేతలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని టాక్. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపణలున్నాయి. తమను కాదని మరొక పార్టీలోకి వెళ్తే ఎంతటివారైనా వదిలేది లేదన్నట్లు వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులకు పట్టలేదని ఇప్పుడు మాత్రం దాడులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
బాలశౌరి ఔట్
కృష్ణా జిల్లాలో ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసుపార్థసారథి టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో అదే జిల్లాలో వైసీపీ బీటలు వారుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి టికెట్ లేదనే ఖరారు కావడంతో ఆయన వైసీపీని దాదాపు వీడతారని ప్రచారం జరుగుతుంది. జనసేనలో చేరవచ్చని వార్తలు అందుతున్నాయి. ఎమ్మెల్యే పేర్నినానితో విభేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పేర్ని నానితో బాటు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు మరో మారు జగన్ దృష్టికి బాలశౌరి గూర్చి ఫిర్యాదు చేశారు. జగన్ అసంతృప్తి నేతలను సముదాయిస్తున్నప్పటికీ బాలశౌరిని వదులుకోవడం వైసీపీ అధినేతను వదులుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలశౌరి వైసీపీని వీడటం పెద్ద నష్టంమనే చెప్పాలి. దాదాపు రెండు సంవత్సరాల నుంచి వైసీపీ అధిష్టానికి జిల్లా నేతలు బాలశౌరికి టికెట్ ఇవ్వొద్దని వత్తిడి తెస్తున్నారు. జగన్ ఫోటో లేకుండానే బందరులో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి బాలశౌరి వైసీపీకి స్వస్థి పలికినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.