సిరా న్యూస్, జైనథ్
ప్రధాన మంత్రిని ఘనంగా స్వాగతిద్దాం
* ఆదిలాబాద్ జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
43 సంవత్సర తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు దేశ ప్రధాని రావడం మన అందరి అదృష్టమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలాల నాయకులతో కార్యకర్తలతో ప్రధానమంత్రి బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని జైనథ్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. అందులో మన ఆదిలాబాద్ జిల్లా పైన ప్రత్యేకంగా దృష్టి సారించి, రోడ్లు మౌలిక సదుపాయాలు వంటి వాటికీ ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు. దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడానికి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు ఈనెల నాలుగవ తేదీన ఉదయం 10 గంటలకు రానున్నారని అన్నారు. అధికారిక కార్యక్రమాలు అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా దర్శిని స్టేడియంలో బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జైనథ్ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.