సిరా న్యూస్,ఖమ్మం;
పవిత్ర గ్రంథం ఖురాన్ ను చదవడం.. నేర్వడం.. ఆచరించడం.. ద్వారా ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ముఫ్తీ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ అన్నారు. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెడతాడో.. అప్పుడు సమాజంలో ఏ సమస్యలు తలెత్తబోవని, తద్వారా అది మానవాళి వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు.ఖమ్మం నగర శివారు గొల్లగూడెంలోని తాలిముల్ ఇస్లాం మదర్సాలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక తరావీహ్ నమాజ్ ద్వారా తొమ్మిది రోజుల్లోనే ఖురాన్ పఠనం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మదర్సాలో జరిగిన ఖత్మే ఖురాన్ వేడుకలో ముఫ్తీ రవూఫ్ ఖాన్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. నేటి తరం పిల్లలు ఖురాన్ ను ప్రేమించడం.. గౌరవించడం గురించి నేర్పాల్సన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని గుర్తు చేశారు. మనిషి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే విశ్వాసం ఒక్కటే ఆయుధమని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అల్లా పై విశ్వాసం తో జీవించడం నేర్చుకోవాలన్నారు. ఇస్లాం ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు.. మరో పది మందికి చేరవేయాలని సూచించారు. తమ పక్కన ఉండే పొరుగువారి ఆకలి ని తీర్చమనే గొప్ప మానవతను చాటి చెప్పిందే ఇస్లాం అన్నారు. అందుకే ఇస్లాం ను ఇతరులు చూసి నేర్చుకునే విధంగా ముస్లింలు ఆచరణ ఉండాలని హితవు పలికారు. అంతకు ముందు జరిగిన ఇఫ్తార్ విందు కు నగర నలుమూలల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
=====================